● దుకాణాల యజమానులకు మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ సూచన
జనగామ: పట్టణంలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వెంటనే నిలిపివేయాలని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, కమిషనర్ రాజశేఖర్రెడ్డి సూచించారు. సోమవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాల యజమానులకు నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ క్యారీ బ్యాగు తయారీ, అమ్మకం, నిల్వ, పంపిణీ, వినియోగం పూర్తిగా నిషేధించారని స్పష్టం చేశారు. వ్యాపారులు వెంటనే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగాన్ని నిలిపివేసి, వాటికి బదులుగా గుడ్డ సంచులు, కాగితపు సంచులు, జీవ విచ్ఛిన్నమయ్యే పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగదారులకు అందించాలని సూచించారు. నిషేధిత ప్లాస్టిక్ క్యారీబ్యాగులను వినియోగిస్తున్నట్లు, విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనల ప్రకారం జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ నిషేధ అమలులో మున్సిపాలిటీకి పూర్తి సహకారం అందిస్తామని హోటల్, రెస్టారెంట్, కిరాణా దుకాణాల యజమానులు ఈసందర్భంగా హామీ ఇచ్చారు.


