వరంగల్ క్రైం: అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, శాంతిభద్రతల నిర్వహణలో మరింత సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎస్.శ్వేత అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ కంట్రోల్ రూం, కమాండ్ కంట్రోల్ రూంను సంబంధిత అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా కంట్రోల్ రూం సిబ్బంది పనితీరు, అత్యవసర కాల్స్ స్వీకరణ విధానం, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, నగరంలోని వివిధ ప్రాంతాలపై నిఘా, సాంకేతిక వ్యవస్థల పనితీరును కమిషనర్ సమీక్షించారు. సీపీ వెంట అదనపు డీసీపీలు ప్రభాకర్ రావు, శ్రీనివాస్, ఏసీపీ జితేందర్ రెడ్డి, ఆర్ఐ సతీష్, క్లూస్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్, ఎస్సై రోహిత్, ఆర్ఎస్సై శ్రవణ్ కుమార్ ఉన్నారు.
సమష్టి కృషితో అధిక లాభాలు
నర్మెట: మహిళలు అడుగు వేస్తే సాధించలేనిదంటూ ఏమీలేదని, సమష్టి కృషితో అధిక లాభాలు సాధించవచ్చని డీఆర్డీఓ ఆర్.భాస్కర్ అన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన నర్మెట ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కం.లి. నాలుగు మండలాల(నర్మెట, తరిగొప్పుల, చిల్పూర్, బచ్చన్నపేట) సంఘాల వార్షిక సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.. కల్తీలేని ఆహార పదార్థాలు అందించే దిశగా పంటల మార్పిడి చేపట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ప్రాసెసింగ్, గ్రేడింగ్ విధానంతో వినియోగదారులకు చేరువకావడంతో పాటు అధిక లాభాలు ఆర్జించవచ్చని అన్నారు. కావలసిన యంత్రాలకు ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఈసందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్గా సుప్రియ, వైస్ చైర్మన్గా లక్క శ్రీలత, కార్యదర్శిగా తప్పెట రజిత ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ ఎమ్డీ నూరొద్దీన్, సెర్ప్ పీఎం పి.ఉమాపతి, సీనియర్ మేనేజర్ శ్రీనివాస్, డీపీఎం నళిని నారాయణ, ఐబీ డీపీఎం శ్రీనివాస్, ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, ఏఓ బుర్రా మమత, సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్, ఏపీఎంలు, సీసీలు, డైరెక్టర్లు, సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
పోస్టర్ల ఆవిష్కరణ
కేయూ క్యాంపస్: కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈఏడాది ఆగస్టు 22న కేయూలో వికసిత్ భారత్ 2047 అకౌంటింగ్, ఫైనాన్స్ పాత్రపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి బుధవారం ఆవిష్కరించారు.


