● కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్
కొమ్మూరి ప్రతాప్రెడ్డి
జనగామ రూరల్: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో అమూల్యమైందని, ఎస్ఐఆర్ ప్రక్రియలో కార్యకర్తలు భాగస్వాములు కావాలని, దొంగ ఓట్లతో అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని జాబ్లీ గార్డెన్లో పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన నియోజకవర్గ సమగ్ర ఓటరు సవరణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కొమ్మూరి మాట్లాడుతూ.. చేర్యాల, జనగామ పట్టణాల్లో 15 వేల వరకు బోగస్ ఓట్లు ఉన్నాయని, ఇప్పుడు అవి బయట పడతాయన్నారు. అన్ని గ్రామాల్లో, పట్టణంలో ఎన్యుమరేషన్ వందశాతం పూర్తి చేసేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ మాట్లాడుతూ..పట్టణంలో ప్రతీ రెండు వార్డులకు ఒక హెల్ప్లైన్ డెస్క్ ఏర్పాటు చేసి ఓటు నమోదుకు కృషి చేస్తామని తెలిపారు. కౌన్సిలర్లు, మండలాల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు.
ముమ్మరంగా ‘ఎస్ఐఆర్’ చేపట్టాలి
జనగామ రూరల్: నియోజకవర్గంలో ఓటరు సవరణ ప్రక్రియ ముమ్మరంగా చేపట్టాలని ఆర్డీఓ గోపిరామ్ అన్నారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గం–98లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫారంల సేకరణ, డిజిటలైజేషన్ పూర్తి చేయాల్సి ఉందన్నారు. 31లోగా ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురించనున్న నేపథ్యంలో సర్వేలో అందరూ భాగస్వాములై సహకరించాలని కోరారు.


