జనగామ: ప్రయాణికుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జనగామ డిపోలో నేడు(మంగళవారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఎం ఉష సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిపో పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. బస్సు సర్వీసులు, సౌకర్యాలు, ఇతర ఫిర్యాదులపై ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.
తైక్వాండో పారా నేషనల్ చాంపియన్షిప్లో ప్రతిభ
స్టేషన్ఘన్పూర్: మండలంలోని విశ్వనాధ పురం గ్రామానికి చెందిన మాచర్ల కృష్ణవేణి అనే క్రీడాకారిణి ఐదో ఇండియన్ తైక్వాండో పారా ఓపెన్ నేషనల్ చాంపియన్ 2026–27 పోటీలలో ఉత్తమ ప్రతిభతో ద్వితీయ స్థానంలో నిలిచి రజక పతకం సాధించింది. మహారాష్ట్రలోని పూణెలోని శ్రీశివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈనెల 10, 11వ తేదీల్లో జరిగిన పోటీల్లో రాష్ట్రం నుంచి పాల్గొన్న కృష్ణవేణి ఉత్తమ ప్రతిభతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రతిభ కనబరిచిన కృష్ణవేణిని గ్రామస్థులతో పాటు క్రీడాకారులు అభినందిస్తున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆదేశాల మేరకు ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని, ప్రాస్పెక్టస్–కమ్–దరఖాస్తు పత్రాలు ఈ నెల 29 నుంచి ఆగస్టు 29 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు మీసేవా, టీజీఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
రఘునాథపల్లి: మండల కేంద్రానికి చెందిన పసునూరి సురేష్–రమ్య దంపతుల కుమారుడు రాజా ఏకాంబరం ఆన్లైన్ క్విజ్ పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (పంజాబ్) వారు నిర్వహించిన ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్లో అత్యున్నత ప్రతిభ చాటడంతో సంస్థ అతడిని సూపర్ టాలెంటెడ్ కిడ్గా గుర్తిస్తూ రికార్డులో చోటు కల్పించింది. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేతుల మీదుగా రాజా ఏకాంబరం తన తండ్రితో కలిసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా బాలుడిని కలెక్టర్ అభినందించారు. రాజా ఏకాంబరం మండల కేంద్రంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో 4వతరగతి చదువుతున్నాడు.
ఘనంగా పోతన సాహితీ పద్యనాటకోత్సవాలు
పాలకుర్తి టౌన్: బమ్మెర పోతన సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో నెల్లుట్ల ఫౌండేషన్ కవులు, కళాకారుల ఐక్యవేదిక జనగామ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సోమవారం మండలంలోని బమ్మెర పోతన స్మృతివనంలో పోతన సాహితీ పద్యనాటకోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నెల్లుట రవీందర్రావు మాట్లాడుతూ.. తెలంగాణలోని 33 జిల్లాల్లో పోతన జీవితంపై పద్యనాటక ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. అనంత రం పోతన సమాధి వద్ద నివాళులర్పించి, కవులు, కళాకారులను సత్కరించారు. సర్పంచ్ రమ్యప్రశాంత్, ప్రముఖ వైద్యుడు మాచర్ల భిక్షపతి, వీణావాణి శర్మ, రాపోలు సత్యనారాయణ, జి.కృష్ణ, పెట్లోజు సోమేశ్వరాచారి, రాపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


