జనగామ రూరల్: విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఆరోగ్యం, ప్రాథమిక విద్యా నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం మండలంలోని చౌడారం మోడల్ పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆల్బెండజోల్ మాత్రలను అందించారు. అనంతరం కలెక్టర్ పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న అన్అకాడమీ తరగతుల బోధనా విధానాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. కలెక్టర్ స్వయంగా రూపొందించిన ‘గెట్ ఐటీ వ్రైట్ ’ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ‘ఫాస్ట్ మ్యాథ్స్’ పుస్తకంలోని ప్రతీ అంశాన్ని రోజూ విద్యార్థులకు బోధించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.
యూనిఫాంలను త్వరగా పంపిణీ చేయాలి
రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలల విద్యార్థినులకు ఎట్టిపరిస్థితుల్లోనూ 15వ తేదీలోపు యూనిఫాంలను పంపిణీ చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సోమవారం యూనిఫాంల పంపిణీ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, ఏపీడీ నూరుద్దీన్, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


