జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంతో పాటు బోధన, మూల్యాంకన విధానాలను ఏకరీతిలో అమలు చేసే దిశగా జిల్లా పరిపాలన కీలక అడుగు వేసింది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ–2020) లక్ష్యాలకు అనుగుణంగా 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లా అకడమిక్ ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ పేరుతో సమగ్ర కార్యాచరణ రూపొందించింది. కలెక్టర్, విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన అకడమిక్, మూల్యాంకన వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు.
సామర్థ్య ఆధారిత బోధనకు ప్రాధాన్యం
సాంప్రదాయ బోధనకు భిన్నంగా ఉపాధ్యాయుడు ఏమి బోధించాడు.. అనే విధానం నుంచి విద్యార్థి ఏమి నేర్చుకున్నాడు.. అనే అభ్యాస ఫలితాల ఆధారిత విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు. నెలవారీ బోధన ప్రణాళికలు, కాన్సెప్ట్ మ్యాప్స్, ప్రయోగశాల కార్యకలాపాలు, ప్రాజెక్టులు, అంచనా, పరిశీలన, వివరణ వంటి ఆధునిక బోధనా పద్ధతులను ఉపాధ్యాయులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఏకరీతి మూల్యాంకన విధానం
జిల్లా అసెస్మెంట్ టూల్కిట్ ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సామర్థ్య ఆధారిత ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్లు, రూబ్రిక్స్, స్లిప్ టెస్టులు, యూనిట్ టెస్టులు, నమూనా ప్రశ్నపత్రాలు, ప్రోగ్రెస్ కార్డులు, రిమిడియల్ బోధన వంటి అంశాలతో ఏకరీతి మూల్యాంకన విధానాన్ని అమలు చేయనున్నారు.
టీచర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు
ప్రతీ పాఠాన్ని నిజజీవిత అనుభవాలతో అనుసంధానం చేయడం, కార్యకలాపాల ఆధారిత బోధన నిర్వహించడం, పరీక్షల అనంతరం రిమిడియల్ తరగతులు చేపట్టడం వంటి అంశాలపై ఉపాధ్యాయులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు. ప్రధానోపాధ్యాయులు తరగతి గది పరిశీలనలు, నెలవారీ సమీక్షలు, ప్రయోగశాలల వినియోగం, మూల్యాంకన విశ్లేషణపై దృష్టి సారించనున్నారు.
దశలవారీ అమలు..
ఈ కార్యక్రమాన్ని మూడు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి దశలో అవగాహన కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయగా, రెండో దశలో బోధన, పరీక్షలు, రిమిడియల్ బోధన కొనసాగుతుంది. మూడో దశలో పర్యవేక్షణ, సమీక్షలు నిర్వహిస్తారు. 2027 ఫిబ్రవరి 28 నాటికి వంద శాతం సిలబస్ పూర్తి చేయడం, ఎఫ్ఏ–ఎస్ఏ మూల్యాంకనాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సామర్థ్య ఆధారిత బోధనను స్థిరీకరించి విద్యార్థుల అభ్యాస ఫలితాలను గణనీయంగా మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం
విద్యార్థులు పాఠాలను కేవలం కంఠస్థం చేయడం కాకుండా, వాటిని అర్థం చేసుకుని నిజజీవితంలో ఉపయోగించే స్థాయికి చేరుకోవాలి. అదే లక్ష్యంతో జిల్లా అకాడమిక్ ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ను రూపొందించాం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2027 ఫిబ్రవరి నాటికి వంద శాతం సిలబస్ పూర్తిచేయడంతో పాటు, విద్యార్థుల అభ్యాస ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల సాధించడమే మా లక్ష్యం. జిల్లాను విద్యా ప్రమాణాల్లో రాష్ట్రానికే ఆదర్శ తీర్చిదిద్దుతాం.
– సందీప్ కుమార్ ఝా,
కలెక్టర్
ప్రతీ విద్యార్థి అభ్యసన పురోగతిపై
ప్రత్యేక దృష్టి
2027 ఫిబ్రవరి నాటికి
100 శాతం సిలబస్ పూర్తి లక్ష్యం
మూడు కీలక మార్గదర్శక పత్రాల
రూపకల్పన
జిల్లా అకాడమిక్–అసెస్మెంట్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్, జిల్లా అకడమిక్ ఫ్రేమ్ వర్క్, జిల్లా అసెస్మెంట్ టూల్కిట్ అనే మూడు సమగ్ర మార్గదర్శక పత్రాలను రూపొందించారు. వీటి ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, అభ్యాసం, మూల్యాంకనం, పర్యవేక్షణ వ్యవస్థలను ఒకే విధానంలో అమలు చేయనున్నారు. విద్యార్థుల్లో భావనాత్మక అవగాహన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.


