● నాట్లు ఎలా వేయాలని రైతుల ఆందోళన
● ఎరువుల కోసం
పడిగాపులు
రఘునాథపల్లి: వానాకాలం పంటల సాగు ఊపందుకుంటున్న వేళ డీఏపీ ఎరువుల కొరత రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఎరువుల దుకాణాల వద్ద డీఏపీ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సాగు కు అత్యంత కీలకమైన డీఏపీ అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రత్నామ్నాయంగా అధిక ధర కలిగిన కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేస్తూ అదనపు ఆర్థిక భారం మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఏపీ 50 కేజీల బస్తా ధర రూ.1,350 మాత్రమే ఉండటంతో రైతులు ప్రధానంగా ఈ ఎరువునే వినియోగిస్తుంటారు. డీఏపీ కొరతను మండలంలోని కొందరు వ్యాపారులు అవకాశంగా మలుచుకొని ఒక్కో బస్తాను రూ.1,500 నుంచి రూ.1,600 వరకు విక్రయించారని రైతులు ఆరోపిస్తున్నారు.
●
రైతులకు అత్యంత అవసరమైన డీఏపీ ఎరువును ప్రభుత్వం వెంటనే అందుబాటులో ఉంచాలి. వరినాట్లు, పత్తి పంట ప్రారంభ దశలో డీఏసీ అత్యవసరం. ముందస్తుగా ఎరువుల నిల్వలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు డీఏపీ దొరకని పరిస్థితి నెలకొంది.
– మంతపురి యాదగిరి, కన్నాయపల్లి
డీఏపీ కొరత రాష్ట్రవ్యాప్తంగా ఉంది. మహిళా సంఘా ల షాపులకు ఇప్పటికే ఇండెంట్ పంపించాం. త్వరలో వచ్చే అవకాశముంది. డీఏపీలా పనిచేసే రూ.750 ధర గల భాస్వరం, కాల్షియం, సల్ఫర్తో కూడిన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తా కూడా బాగా పని చేస్తుంది. ఒక డీఏసీ బస్తాకు బదులు రెండు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బస్తాలు వేస్తే సరిపోతుంది.
– కరుణాకర్, మండల వ్యవసాయాధికారి


