అక్రమాలకు
చెక్..
జనగామ: ఆన్లైన్ పారదర్శక విధానంతో ఇసుక, మొరం, మట్టి అక్రమ రవాణాకు కళ్లెం పడగా, తక్కువ వ్యవధిలోనే ప్రభుత్వ ఖజానాకు రూ.5.5కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. జిల్లా కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇసుక, మొరం తరలింపులో తీసుకొచ్చిన పారదర్శక విధానాలు ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచాయి. కేవలం నాలుగున్నర నెలల కాలంలో ఇసుక తరలింపు ఫీజుల రూపంలో జిల్లాకు కోట్ల మేర ఆదాయం సమకూరింది.
నాడు అక్రమ రవాణా.. నేడు ఆదాయమార్గంగా
గతంలో జిల్లాలోని బచ్చన్నపేట, కోమళ్ల, దేవరుప్పుల, చిల్పూరు, ఇప్పగూడెం, వడ్లకొండ, చీటకోడూరు, యశ్వంతాపూర్, జఫర్గఢ్, లింగాలఘణపురం తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ లక్షల రూపాయల విలువైన ఇసుక, మొరం, మట్టి అక్రమంగా తరలించారు. తనిఖీలు జరిగినా అవి నామమాత్రంగానే ఉండేవి. అక్రమ రవాణా పేరిట భారీ స్థాయిలో మామూళ్లు చేతులు మారేవన్న ఆరోపణలు లేకపోలేదు. అయితే కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇసుక, మొరం, మట్టి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. కఠిన నిబంధనలు అమలు చేయడంతో పాటు అక్రమంగా తరలించే వాహనాలపై కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధించడంతో కొద్దిరోజుల వ్యవధిలోనే అక్రమ రవాణా అరికట్టగలిగారు. అదే సమయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇసుక, మొరం తరలింపునకు ఆన్లైన్ అనుమతి వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానం వల్ల అనుమతుల జారీ ప్రక్రియ పారదర్శకంగా మారడంతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన ఫీజులు నేరుగా ఖజానాకు చేరుతున్నాయి.
పదేళ్ల ఆదాయం ఎవరి జేబుల్లోకి..?
జిల్లా ఏర్పడిన పదేళ్లలో ఇసుక అక్రమ రవాణా పేరిట చేసిన వసూళ్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయనే చర్చ సాగుతోంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం 136 రోజుల్లోనే ప్రస్తుత కలెక్టర్ అక్రమ రవాణాను కట్టడి చేసి రూ.5.5 కోట్లకుపైగా ప్రభుత్వ ఆదాయం సమకూర్చగలిగారు. ఇదే వేగం కొనసాగితే జిల్లా ఖజానాకు మ రింత ఆదాయం వచ్చే అవకాశముంది.
క్యూబిక్ మీటర్ ధరలు
ఇసుకకు క్యూబిక్ మీటర్కు రూ.450, సొంత పొలం నుంచి మొరం లేదా మట్టి తరలించాలంటే రూ.324, ఇతర ప్రాంతాల నుంచి మట్టి లేదా మొరం తరలించాలంటే రూ.428 చెల్లించాలి. ఇటుకల తయారీ మట్టికి క్యూబిక్ మీటర్కు రూ.19,828 చలాన్న్ తీసుకోవాలి. ములుగు నుంచి తీసుకొచ్చే గోదావరి ఇసుకను డంప్ యార్డు నుంచి ట్రాక్టర్లలో తరలించేందుకు అదనంగా రూ.45 అడ్మినిస్ట్రేటివ్ చార్జీ వసూలు చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉంటుంది. స్లాట్ బుక్ చేసిన వెంటనే సంబంధిత జీపీఓకు సమాచారం వెళ్తుంది. రెండు ట్రిప్పులు అవసరమైతే ప్రయాణ సమయాన్ని అంచనా వేసుకుని వేర్వేరుగా స్లాట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కూపన్ జనరేట్ అయిన వెంటనే జీపీఓకు సమాచారం వెళ్తుంది. ఇసుక కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వాగు వద్ద కూపన్ను స్కాన్ చేసిన తర్వాత అదే కూపన్ను మళ్లీ వినియోగించేందుకు ప్రయత్నిస్తే జీపీఓ, ఎస్సై, తహసీల్దార్, కలెక్టరేట్కు వెంటనే అలర్ట్ వెళ్తుంది. గతంలో ఇసుక అనుమతుల విషయంలో మధ్యవర్తులు, అక్రమ రవాణా, రెవెన్యూ నష్టం వంటి ఆరోపణలు ఉండేవి. ప్రస్తుతం స్లాట్ బుకింగ్తో మధ్యవర్తుల జోక్యం తగ్గి పారదర్శకత పెరిగింది.
ఇసుక బుకింగ్ చేసుకునే పోర్టల్
ఆన్లైన్ విధానంతో ఇసుక, మొరం రవాణాలో పారదర్శకత
136 రోజుల్లో ప్రభుత్వ ఖజానాలోకి రూ.5.5 కోట్లు
గతంలో ఇసుక మాఫియా దందాలు
కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తుండడంతో తగ్గిన అక్రమాలు
ఆన్లైన్ స్లాట్ బుకింగ్తో..
జిల్లాలో ఇసుక తదితర రవాణాను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. ప్రజలు మీ సేవా పోర్టల్ లేదా సిటిజన్ యాప్ ద్వారా esandjangoan.telangana.gov.in వెబ్సైట్లో ముందురోజే స్లాట్ బుక్ చేసుకుని అనుమతులు పొందాలి.


