జగిత్యాల బల్దియాకు
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇద్దరు పారిశుధ్య కార్మికులు డీజిల్ చోరీ చేస్తూ.. రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటనతో బల్దియాలో ఎంత అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. తరచూ ఏదో ఒక ఘటన వెలుగు చూస్తుండడంతో మున్సిపల్కు ఏమైందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాలకవర్గం, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదా..? అనే చర్చ మొదలైంది. కొంతకాలంగా బల్దియాలో అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్, ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. వారి దాడుల్లోనూ అనేక అక్రమాలు బయటపడిన విషయం తెలిసిందే. అక్రమాల్లో బల్దియా అధికారుల పాత్ర ఉందని గుర్తించిన విజిలెన్స్, ఏసీబీ అధికారులు నివేదికను సీడీఎంఏకు పంపించారు.
● అవినీతికి కేరాఫ్
గతంలో టౌన్ప్లానింగ్ విభాగంలో లంచాలు తీసుకుంటూ టీపీవో రెడ్హ్యాండెడ్గా దొరికిన విషయం తెలిసిందే. ఇటీవల ఏసీబీ అధికారులు ఏకకాలంలో 10 గంటలు దాడులు చేసి అనేక అక్రమాలు, నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రజావాణిలో ఫిర్యాదులు వస్తున్నా ప్రజాప్రతినిధుల జోక్యంతో పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇంజినీరింగ్ విభాగంలో పనుల విషయంలో జాప్యం జరుగుతోందని ఇటీవల అధికారులు గుర్తించారు. నిధులు ఉన్నా కొందరు పనులు చేపట్టకపోవడం, చేపట్టినా నాణ్యత లేకపోవడం, అనతికాలంలోనే డ్రైనేజీలు, సీసీరోడ్లు దెబ్బతింటున్నాయనే ఆరోపణలున్నాయి. సుందరీకరణ పేరిట ఏర్పాటు చేసిన జంక్షన్లు కళాహీనంగా మారాయి. ఎక్కడా ఫౌంటేన్లు పనిచేయడం లేదు. డివైడర్లలోని చెట్లపై శ్రద్ధ తీసుకోవడం లేదు. ఇటీవల డబుల్బెడ్రూంల వద్ద రోడ్లు నిర్మించగా సుమారు రూ.20 లక్షల బిల్లు పెట్టారని, ఆ పనులను మున్సిపల్ కార్మికులే చేసినట్లు తెలిసింది. ఇక రెవెన్యూ సెక్షన్లో సైతం అనేక అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ శాఖలో అక్రమంగా ముటేషన్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో ఓ భూకబ్జాకు సంబంధించి కమిషనర్, ఆర్వో సైతం జైలుకెళ్లిన విషయం తెలిసిందే.
పనుల్లో జాప్యం..
జిల్లా కేంద్రంలో సుమారు రూ.60 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నా.. ఎక్కడా సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల 45వ వార్డుకు చెందిన ఓ మహిళ 2020లోనే డ్రైనేజీకి రూ.20 లక్షలు కేటాయించారని, ఇప్పటివరకు పనులు చేపట్టలేదని బహిరంగంగానే ఆరోపించారు. శానిటేషన్కు సంబంధించి డీజిల్ బిల్లులపై ఎక్కువ అవినీతి జరిగిందని ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లాయి. అప్పటి కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి డీజిల్ బిల్లులు రూ.8 లక్షలు వచ్చేలా చేశారు. తాజాగా మళ్లీ రూ.12లక్షలకు పైగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల డీజిల్ చోరీ బయటపడటంతో అవకతవకల ఆరోపణలకు బలం చేకూరింది.


