ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఆదివారం కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా కు టుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయం పక్షాన మేళతాళాలతో స్వాగతం పలికారు. సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. అలాగే పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్రెడ్డి దంపతులు స్వామివారలను దర్శించుకున్నారు.
రైతులపై కాంగ్రెస్ కపట ప్రేమ
రాయికల్: రైతు సంక్షేమమని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి సకాలంలో రైతు బీమా ప్రీమియం చెల్లించక అన్నదాతలపై కపట ప్రేమ చూపుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి విమర్శించారు. ఆదివారం రాయికల్లో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించలేక ఆయనను ప్రజలు మరిచిపోతున్నారనే ఉద్దేశంతో రేషన్కార్డులకు స్మార్ట్కార్డులని సీఎం ఫొటో చేర్చారని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతీ పథకాన్ని అమలు చేయాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఉసురుతగిలి సీఎంను గద్దె దించుతారని జోస్యం చెప్పారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తురగ సౌజన్య, మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్యాదవ్, పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్, కౌన్సిలర్ రాకేశ్నాయక్, నాయకులు కోయ్యడి మహిపాల్రెడ్డి, చింతలపెల్లి గంగారెడ్డి, సిరిపురం గంగాధర్, హరీశ్రావు, సుధీర్రెడ్డి ఉన్నారు.
ధ్యానంతో ప్రశాంతత
వెల్గటూర్: ధ్యానం చేయడం వల్ల మనిషి తనను తాను జయించవచ్చని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ జిల్లా అధ్యక్షుడు ముక్కా సత్యనారాయణ అన్నారు. వెల్గటూర్ మండల అధ్యక్షుడు బండారి సత్యనారాయణ ఆధ్వర్యంలో ధ్యాన శాఖాహార సద్భావన యాత్రలో భాగంగా ఆదివారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. శాఖాహారం తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని, అహింస వైపు మనిషి దృష్టి సారిస్తారని తెలిపారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే శ్వాస పైన, ధ్యానం పైన దృష్టి సారించగలరని పేర్కొన్నారు. మాంసాహారం తినడం వల్ల మనిషిలో హింసా ప్రవృత్తి పెరుగుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ శాఖాహారం భుజించాలన్నారు. సొసైటీ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు, జిల్లా అఽధ్యక్షులు రమేశ్, లక్ష్మారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.


