ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయానికి భక్తులు శనివారం పోటెత్తారు. ఆషాఢమాసం కృష్ణపక్షం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకున్నారు.
పిల్లల మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణం
జగిత్యాలరూరల్: మల్యాల మండలం ఎస్సీ హాస్టల్కు చెందిన ఇద్దరు విద్యార్థుల మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి అన్నారు. మట్టిని అక్రమంగా తవ్వడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయని, లోతు తెలియకనే జగిత్యాలలోని టీఆర్నగర్కు చెందిన సుశాంత్ నీటిలో పడి మృతిచెందాడని తెలిపారు. స్కూల్ సమీపంలో మట్టి అక్రమంగా తవ్వినా రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలన్నారు. అధికారులు అక్రమ తవ్వకాలపై దృష్టి సారించాలన్నారు. చిన్నారుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కౌన్సిలర్ దేవేందర్నాయక్, సర్పంచ్ శీలం సురేందర్, నాయకులు సిరజ్, రజినీకాంత్, సురేశ్, తిరుపతి, బాబుమియా పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్తో
పేదలకు మేలు
మెట్పల్లి: సీఎం సహాయనిధితో పేదలకు మేలు జరుగుతోందని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు తెలిపారు. నియోజకవర్గానికి చెందిన 52మందికి సీఎం సహాయ నిధి నుంచి రూ.25.08లక్షల ఆర్థిక సహాయం మంజూరుకాగా.. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు. ఈనెల 15నుంచి ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేస్తుందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, నాయకులు ఉన్నారు.
బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వండి
మెట్పల్లి: అర్హులైన బీడీ కార్మికులకు జీవనభృతి మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో శనివారం బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. మహిళా కౌన్సిలర్లు బీడీలు చుడుతూ నిరసన తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ మాట్లాడుతూ ఈనెల 15నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అందులో వృద్ధులు, బీడీ కార్మికులను చేర్చకపోవడం సరికాదన్నారు. వేలాది మంది కార్మికులు, వృద్ధులు పెన్షన్ల కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారని, వారికి కూడా పెన్షన్లు అందించి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప, కౌన్సిలర్లు బొడ్ల ఆనంద్, శిరీష తదితరులున్నారు.


