ఈనెల 10తో ముగియనున్న ప్రక్రియ ● ఎస్ఐఆర్ 89.59శాతం
జగిత్యాల: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ ఈనెల 10తో ముగియనుంది. ఈనెల 10లోపు ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోలకు అందిస్తే డిజిటలైజేషన్ పూర్తి చేస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు 89.59 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. సర్ ప్రక్రియలో పాల్గొంటున్న వారు డిజిటలైజేషన్ వేగవంతం చేశారు. వాస్తవానికి సర్ గతనెల 24తో ముగియాల్సి ఉండగా.. ఓటర్ల నుంచి స్పందన రాకపోవడంతో ఈనెల 3 వరకు గడువు పెంచారు. మళ్లీ ఈనెల 10 వరకు పెంచడంతో కొంత మేర డిజిటలైజేషన్ పెరిగింది. మున్సిపాలిటీల్లో కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ గ్రామాల్లో చకచకా పూర్తయింది. ఇప్పటికే రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు ఈ సర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. మొదట ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మెళ్లిగా పుంజుకుంది. రెండు రోజుల్లో 100 శాతం పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సర్పై అవగాహన కల్పించేలా కోరడంతో పాటు, ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పాలని సూచించారు. రాజకీయ పార్టీల నాయకులు కొన్ని అభ్యంతరాలు వారి దృష్టికి తీసుకెళ్లారు.
ఓటర్లు తస్మాత్ జాగ్రత్తా
ఓటర్లు అప్రమత్తంగా లేకుంటే భారీ నష్టం జరిగే అవకాశముంది. ఓటరు ఇక్కడే ఉండి ఓటరు జాబితాలో పేరు లేకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవనున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 10న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించనుండగా ఓటర్లు కచ్చితంగా జాబితాలో తమ పేరుందో లేదో చూసుకోవాల్సిందే. లేకుంటే తదుపరి ఓటరుగా నమోదు కావాలంటే ఇబ్బందితో కూడుకున్న పని.
సర్ షెడ్యూల్
ముసాయిదా జాబితా ప్రకటన:
ఆగస్టు 10
ఫిర్యాదులు, అభ్యంతరాలు:
ఈ నెల 10నుంచి సెప్టెంబర్ 9వరకు
నోటీసుల జారీ, పరిశీలన:
ఈ నెల 10నుంచి అక్టోబర్ 10
తుది ఓటరు జాబితా:
అక్టోబర్ 12, 2026


