మంథని: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు సహోదరి, మంథని మాజీ సర్పంచ్ దివంగత సువర్ణ చంటయ్య సతీమణి సువర్ణ వనమాల(91) సోమవారం ఉదయం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందారు. మంగళవారం మంథని సమీపంలోని గోదావరి తీరంలో అంత్రక్రియలు జరుగుతాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబుకు స్వయాన ఆమె వనమాన మేనత్త. ఆమె మృతికి సంతాపం తెలిపారు.
రాయికల్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ శాఖ 12వ వార్షికోత్సవ వేడుకలు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్సెల్ ఆస్ట్రేలియా ఇన్చార్జి బైరెడ్డి అనిల్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ్యులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ బలోపేతానికి ఎన్ఆర్ఐలు చేయాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రమేశ్, మధు, రాహూల్, రవీందర్, కార్తీక్, స్వప్న, ప్రియాంక, మధు పాల్గొన్నారు.
అమ్మవారి ఒడిబియ్యం, చీరలకు వేలం
గన్నేరువరం:ఖాసీంపేట శ్రీమానసాదేవి ఆలయంలో భక్తులు సమర్పించిన ఒడిబియ్యం, చీరలకు సోమవారం వేలం పాట నిర్వహించారు. గ్రామానికి చెందిన బత్తుల మల్లయ్య రూ.17.80 లక్షలకు ఒడిబియ్యం, చీరలు దక్కించుకున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్నె చంద్రయ్య, ప్రతినిధులు బద్దం కనుకారెడ్డి, సింగిరెడ్డి లచ్చిరెడ్డి, బొజ్జ నాగయ్య, బుర్ర ఎల్లయ్య, అకెన రవి, నాగనూరి స్వామి, బద్దం తిరుపతిరెడ్డి, బద్దం వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాయికల్: రెండు రోజుల క్రితం పట్టణానికి చెందిన లెక్చరర్ శివప్రసాద్ ద్విచక్రవాహనం దొంగిలించిన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం తిరువంతపూర్కు సంతోష్ను సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. మల్లాపూర్ మండలం వీవీరావుపేటలో కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్న సంతోష్ శనివారం రాయికల్లోని శివప్రసాద్ ఇంట్లోకి వచ్చి వాహనాన్ని దొంగిలించాడన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గాలించగా కొత్తపేటలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న సంతోష్ను పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.
కథలాపూర్: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో సోమవారం పిచ్చికుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులు గాయాలపాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన బాలు, శోభ, వరుణ్తేజ అనే చిన్నారులు తమ ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచిందన్నారు. గాయాలపాలైన చిన్నారులకు కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
డీబీటీ ద్వారా విద్యార్థుల ఖాతాల్లో జమ
జగిత్యాల: జగిత్యాల జిల్లా పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు సంబంధించిన మెయింటనెన్స్, ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రా న్స్ఫర్ విధానం ద్వారా నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ అవుతాయని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి జయరాజ్ తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్స్ విద్యార్థులకు సంబంధించిన ఫ్రెష్, రెన్యువల్ అప్లికేషన్స్పై అవగాహన కల్పించుకునేలా చూడాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈపాస్ పోర్టల్లో ఆధార్ సీడింగ్ గల బ్యాంక్ ఖాతాలతో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జగిత్యాలక్రైం: తెలంగాణ రాష్ట్ర పోలీసు సంఘం సూచనల మేరకు జగిత్యాల జిల్లాలో టీజీపీవోఏ తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ జిల్లాలోని ఒక పోలీస్స్టేషన్ నుంచి ఒక వ్యక్తిని ఎంపిక చేసి ఈనెల 25లోపు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. దీంతో ఈనెల 25న జిల్లా పోలీసు ఎన్నిక కార్యవర్గం ఏర్పాటు చేసి ఈనెల 30 వరకు రాష్ట్ర కమిటీకి నివేదిక పంపనున్నారు.


