Fact Check: మార్చిలో మరో యుగాంతం!

World Will End In March 2021 Rumours Spread - Sakshi

వాషింగ్టన్‌: భూమి అంతం.. పెను ప్రళయం.. యుగాంతం.. అంటూ ప్రతిఏటా ఎవరో ఒకరు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట చెబుతూనే ఉంటారు. 2020లో కరోనా వచ్చినప్పుడైతే ఈ ఊహాగానాలకు అంతులేకుండా పోయింది. అయితే అనూహ్యంగా కరోనాను మానవాళి జయించడంతో ఈ అంచనాలన్నీ తప్పిపోయాయి. దీంతో తాజాగా వచ్చే నెల్లో భూగోళానికి పెను ముప్పు పొంచి ఉందని అమెరికాలో అబద్ధపు ప్రచారం మొదలైంది.

మార్చిలో ఇప్పటివరకు చూడనంత పెద్ద ఆస్టరాయిడ్‌(గ్రహశకలం) భూమికి సమీపంలోకి రానున్న తరుణంలో కొన్ని ఫేక్‌ సైట్లు ఈ శకలం భూమిని ఢీకొట్టబోతోందంటూ ప్రాపగాండా చేస్తున్నాయి. అయితే సైంటిస్టులు అలాంటిదేమీ లేదని భరోసా ఇస్తున్నారు. మార్చి 21న భారీ ఆస్టరాయిడ్‌(పేరు:2001 ఎఫ్‌ఓ32) భూమికి సమీపంలోకి రానున్నమాట వాస్తవమేనని, కానీ భూమిని ఢీకొట్టడమనేది అబద్ధమని చెబుతున్నారు. ఈ ఆస్టరాయిడ్‌ పలు ఎన్‌ఈఓ(నియర్‌ ఎర్త్‌ ఆబ్జెక్ట్స్‌)ల్లో ఒకటని, ఇవన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని వివరించారు.  

ఇలాంటివి అనేకం.. 
భూ కక్ష్యకు 3 కోట్ల మైళ్ల లోపు దగ్గరకు వచ్చే శకలాలను ఎన్‌ఈఓలు అంటారు. ఇప్పటివరకు దాదాపు 25వేల ఎన్‌ఈఓలను గుర్తించారు. వీటిలో అధిక శాతం ఆస్టరాయిడ్స్‌ కాగా కొన్ని మాత్రం తోకచుక్కలు. ఈ 25వేల ఎన్‌ఈఓల్లో 2100 ఎన్‌ఈఓలను పొటన్షియల్లీ హజార్డియస్‌(ప్రమాదం కలిగించే శక్తి కలవి)గా వర్గీకరించారు. భూకక్ష్యకు 46 లక్షల మైళ్ల దూరంలోకి వచ్చేవి, వ్యాసార్ధంలో 460 అడుగుల కన్నా పెద్దవైన శకలాలను ఈ కేటగిరీలో చేరుస్తారు. అంతమాత్రాన ఇవన్నీ భూమిని తాకుతాయని కాదని, కానీ వీటిని పరిశీలిస్తూ ఉంటామని సెంటర్‌ ఫర్‌ ఎన్‌ఈఓ డైరెక్టర్‌ పాల్‌ చోడస్‌ చెప్పారు.

ప్రస్తుతం వస్తున్న ఆస్టరాయిడ్‌ వ్యాసార్ధం దాదాపు 2,526–5,577 అడుగులుంటుందని చెప్పారు. మార్చి 21 ఉదయం 11గంటలకు ఈ శకలం భూమికి 13 లక్షల మైళ్ల దగ్గరకు వస్తుంది. ఈ సమయంలో ఆస్టరాయిడ్‌ గంటకు 76,980 మైళ్ల వేగంతో పయనిస్తుంటుంది. భూమికి దగ్గరగా వచ్చిన అనంతరం తిరిగి ఈ గ్రహశకలం తన దోవలో తను పోతుందని, భూమిని ఢీకొట్టే అవకాశం లేదని పాల్‌ తెలిపారు. కాబట్టి.. యుగాంతం జాతకాలు చెప్పేవాళ్లు ఇంకో కొత్త సంగతి చూసుకోవాల్సిందే!   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top