భారత్‌కు రాలేనన్న పుతిన్‌.. అరెస్ట్‌ భయమే కారణమా? | Vladimir Putin Says Russian Foreign Minister To Attend G20 | Sakshi
Sakshi News home page

భారత్‌కు రాలేనన్న పుతిన్‌.. అరెస్ట్‌ భయమే కారణమా?

Aug 28 2023 9:07 PM | Updated on Aug 28 2023 9:29 PM

Vladimir Putin Says Russian Foreign Minister To Attend G20 - Sakshi

వచ్చే నెలలో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే జీ-20 సమావేశాలకు భారత్‌ సిద్ధమవుతోంది. ఈ సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి నేతలు, ప్రముఖులు హాజరుకానున్నారు. మరోవైపు.. జీ-20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హాజరు కావడం లేదు. ఈ మేరకు పుతిన్‌.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. పుతిన్‌ బదులుగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ హాజరు కానున్నట్టు తెలిపారు. 

వివరాల ప్రకారం.. భారత్‌లో జీ-20 సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రధాని మోదీకి ఫోన్‌ చేసినట్లు పీఎంవో సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సులో పాల్గొనేందుకు తాను భారత్‌కు రాలేనని పుతిన్.. మోదీకి తెలిపారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరిగే సదస్సులో రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ పాల్గొంటారని పుతిన్ స్పష్టం చేశారు. రష్యా నిర్ణయంపై, భారత్‌ అధ్యక్షతన జరుగుతున్న జీ-20 సమ్మిట్‌ కార్యక్రమాలకు రష్యా మద్దతు ఇచ్చినందుకు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై పురోగతిని సమీక్షించారు. గత వారం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పరస్పరం మాట్లాడిన నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యల గురించి కూడా మాట్లాడారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇరువురు నేతలు టచ్‌లో ఉండేందుకు అంగీకరించారని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. మరోవైపు.. ఉక్రెయిన్‌లో దాడుల కారణంగా పుతిన్‌ అరెస్ట్‌కు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు వారెంట్‌ జారీ చేసిన నేపథ్యంలో ఆయన విదేశాలకు వెళ్తే అరెస్ట్‌ అ‍య్యే అవకాశం కూడా ఉంది. ఈ కారణంగానే పుతిన్‌ ఇతర దేశాల్లో సమావేశాలకు హాజరుకావడంలేదని తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాలో కూలిన అమెరికా నేవీ విమానం

Advertisement
 
Advertisement
Advertisement