
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇరాన్పై ముప్పెట దాడి మొదలైంది. అంతా అనుకున్నట్టుగానే ఇరాన్పై తాజాగా అమెరికా విరుచుకుపడింది. ఇరాన్లోని అణు కేంద్రాలే టార్గెట్గా అమెరికా భారీ దాడులు చేసింది. దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై అమెరికా విజయవంతంగా దాడులు చేసిందని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇక, ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడింది. ఈ దాడుల అనంతరం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ క్రమంలో ట్రంప్ ట్విట్టర్ వేదికగా.. ‘ఇరాన్పై అమెరికా దాడులు చేసింది. భారీ బాంబులు ఫోర్డోపై వేశాం. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం. విమానాలు సురక్షితంగా అమెరికాకు తిరుగుముఖం పట్టాయి. అమెరికా యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే దేశానికి చెందిన మిలిటరీకి ఇది సాధ్యంకాదు. ఇప్పుడు శాంతికి సమయం’ అని చెప్పుకొచ్చారు.
— Donald J. Trump (@realDonaldTrump) June 21, 2025
మరో పోస్టులో ‘ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో నాశనమైంది’ అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. తమ విమానాలు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక, ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా కూడా ఇరాన్పై దాడులు ప్రారంభించడంతో భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. కాగా, ఈ దాడి నేపథ్యంలో ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రకటించింది.
ఇదిలా ఉండగా.. నిన్న రాత్రే అమెరికాలోని వైట్మన్ ఎయిర్ బేస్ నుంచి మరిన్ని బీ-2 స్పిరిట్లు, ఎనిమిది కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్లు ఇండో-పసిఫిక్లోని డియాగో గార్సియా దిశగా బయల్దేరి వెళ్లాయి. ఇవి మైటీ11, మైటీ21 అనే కాల్సైన్లు వాడినట్లు ఫ్లైట్ రాడార్ 24 పేర్కొంది. గతంలో కూడా బీ-2 స్పిరిట్లు ప్రత్యేక ఆపరేషన్ల కోసం బయల్దేరిన సమయంలో ‘మైటీ’ కాల్సైన్లను వాడాయి. ఈ దాడితో అమెరికా కూడా యుద్ధ రంగంలోకి ప్రవేశించినట్లైంది. అగ్రరాజ్య ప్లానింగ్కు పూర్తిగా సహకరించినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.
ఫోర్డో అణుకేంద్రం క్వామ్ నగరానికి అత్యంత సమీపంలో ఉంది. అక్కడి ప్రజలు పేలుళ్ల చప్పుళ్లు విన్నట్లు మీడియాకు వెల్లడించారు. ఈ అణుకేంద్రం ఇరాన్కు చాలా కీలకమైంది. అక్కడి పర్వతాన్ని తొలిచి కొన్ని వందల అడుగుల లోతులో దీనిని నిర్మించారు. 1981లో బాగ్దాద్లో ఇజ్రాయెల్ ఎఫ్15, ఎఫ్16 యుద్ధ విమానాలు అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుజాగ్రత్తగా దీన్ని నిర్మించారు. 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్స్పెక్టర్లు ఇక్కడ 83.7శాతం శుద్ధిచేసిన యురేనియంను గుర్తించారు. అత్యంత శక్తిమంతమైన అణుబాంబుల్లో వాడే 90శాతం శుద్ధి చేసిన యురేనియంకు ఇది చాలా దగ్గర్లో ఉంది. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసిన నేపథ్యంలో ఆ దేశం ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం.
బీ-2 బాంబర్లు..
ఒక చిన్న పక్షికి సమానంగా బీ-2 బాంబర్ల రాడార్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. ఒక్కో బీ-2 బాంబర్ రెండు ఆయుధాలను మోసుకెళ్లగలుగుతుంది. 15 టన్నుల బరువున్న రెండు బంకర్ బ్లాస్టర్లను మోసుకెల్లే సామర్థ్యం వీటికి ఉంది. తాజాగా ఆరు బీ-2 బాంబర్లు ఇరాన్పై దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఇవి ఒక్కసారిగా 11,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు.
B-2 Spirit Stealth Bomber
🇺🇸 U.S. Air Force heavy strategic bomber
Designed for stealth, it can penetrate dense enemy air defenses undetected
Carries conventional and nuclear weapons
Range: ~11,000 km (6,800 miles) without refueling
Cost: ~$2 billion per unit
Only 21 were… pic.twitter.com/IcF5FsYxED— Israel MyChannel (@IsraelMychannel) June 21, 2025
అంతకుముందే ఇరాన్ను ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇజ్రాయెల్పై ప్రశంసలు కురిపించారు. ఇజ్రాయెల్ విజయపథంలో ఉందని, ఇప్పుడు ఆ దేశాన్ని యుద్ధం ఆపమని తాను చెప్పలేనని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ అద్భుతంగా రాణిస్తోంది. ఇరాన్ అంతగా ప్రభావం చూపడం లేదు. ఇప్పుడు యుద్ధాన్ని ఆపడం కష్టమే అని చెప్పుకొచ్చారు. అమెరికా సాయం లేకుండా ఇరాన్కు చెందిన ఫోర్డ్ భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం టెల్అవీవ్కు లేదన్నారు. ఒకవేళ వారు దాడులు చేసినా అది పెద్ద ప్రభావం చూపించవన్నారు. వారికి ఆ సామర్థ్యం లేదన్నారు.
Visuals: Huge US airstrikes on Fordow, Natanz, and Esfahan Iranian nuclear facilities. pic.twitter.com/fSIcAHu3X3
— Black Cobra ⚡ (@Blackcobra00007) June 22, 2025
అలాగే, ఐరోపా నేతలు జరుపుతున్న చర్చలు కూడా ఫలవంతం కావని అన్నారు. వారు ఇరాన్కు ఎలాంటి సాయం చేయలేరని తెలిపారు. ఇదే సమయంలో ‘ఐరోపాతో ఇరాన్ మాట్లాడాలని అనుకోవడం లేదు. మాతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ విషయంలో ఐరోపా ఏ రకంగానూ సాయం చేయలేదు. నేను శాంతి దూతను. కొన్ని పరిస్థితుల్లో శాంతిదూత కూడా కఠినంగా ఉండాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు.