యుద్ధమా? ఒప్పందమా?  | USA President Donald Trump warnings to iran | Sakshi
Sakshi News home page

యుద్ధమా? ఒప్పందమా? 

May 24 2026 4:43 AM | Updated on May 24 2026 4:43 AM

USA President Donald Trump warnings to iran

ఇరాన్‌ త్వరగా తేల్చుకోవాలి  

ఆదివారం లోగా తుది నిర్ణయం తీసుకుంటా  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరిక  

వాషింగ్టన్‌/ఇస్లామాబాద్‌:  పశ్చిమాసియాలో సంక్షోభానికి తెరదించడానికి ఇరాన్‌ తమతో ఒప్పందానికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి హెచ్చరించారు. ఇరాన్‌పై బాంబు దాడులు పునఃప్రారంభించాలా? లేదా? అనే దానిపై తన ఆలోచనలు ఫిఫ్టీ.. పిఫ్లీగా ఉన్నాయని తేల్చిచెప్పారు. ఆదివారం నాటికి తుది నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఆయన శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. 

ఇరాన్‌ వ్యవహారంలో రెండు అంశాల్లో ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటున్నానని వెల్లడించారు. ఒకటి.. వారు(ఇరాన్‌) ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోనంత గట్టిగా తాను దెబ్బకొడతానని వ్యాఖ్యానించారు. రెండోది.. ఒక మంచి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు చేస్తాయని పేర్కొన్నారు. యుద్ధం కావాలో లేక ఒప్పందం కావాలో ఇరాన్‌ త్వరగా తేల్చుకోవాలని సూచించారు. 

ఇరాన్‌తో తాను చక్కటి ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని లేదా ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇరాన్, పాకిస్తాన్‌ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీని ప్రకారం.. అమెరికా, ఇరాన్‌లు సైనిక చర్యను నిలిపివేయాలి. ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడమే లక్ష్యంగా 30 రోజుల పాటు విస్తృతస్థాయిలో చర్చలు జరపడానికి ఇరుదేశాలు అంగీకరించాలి. చివరి నిమిషంలో జరిగే చర్చలు శాంతి ఒప్పందానికి దారితీయకపోతే, ఇరాన్‌పై కొత్తగా దాడులు చేసే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా పరిశీలిస్తున్నారని అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్‌ వెల్లడించింది.  

ఇరాన్‌ నేతలతో అసిమ్‌ మునిర్‌ భేటీ  
పశ్చిమాసియాలో ఘర్షణను తెరదించాలని పాకిస్తాన్‌ తన వంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునిర్‌ ఇరాన్‌లో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చితోపాటు ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బాఘేర్‌ ఘలిబాఫ్‌ను కలుసుకున్నారు. తాజా పరిణామాలపై వారితో చర్చించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను నివారించడం.. శాంతి, స్థిరత్వం, భద్రతను ప్రోత్సహించడంపై సంప్రదింపులు జరిపారు. ఇరాన్, పాకిస్తాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలు, వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకొనే మార్గాలపై పెజెష్కియాన్, అసిమ్‌ మునిర్‌ చర్చించుకున్నట్లు ఇరాన్‌ అధికారిక తస్నిమ్‌ వార్తా సంస్థ తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement