ట్రంప్‌ ఓటమి భారత్‌కు మంచిదేనా!? | US Election Results: What Does Goodbye Donald Trump Mean For India | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఓటమి భారత్‌కు మంచిదేనా!?

Nov 9 2020 1:49 PM | Updated on Nov 9 2020 7:54 PM

US Election Results: What Does Goodbye Donald Trump Mean For India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో డెమోక్రట్ల అభ్యర్థి జో బైడన్‌ విజయం సాధించడానికి బిహార్‌ ఎన్నికల ఫలితాలకు ఏమైనా సంబంధం ఉంటుందా ? అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఓ పక్క కొనసాగుతుండగానే బిహార్‌లో ఆఖరి విడత పోలింగ్‌ జరిగింది. ఆ సందర్భంగా నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోతుందని, ఆర్జేడీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేలిందంటే అమెరికా ఎన్నికల ప్రభావం ఉన్నట్లేగదా! అని కొంతమంది ట్విటర్‌లో ప్రశ్నిస్తున్నారు. (టార్గెట్‌ బైడెన్‌ వయా చైనా!)

బిహార్‌ ఆఖరి విడత పోలింగ్‌ రోజున అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉందని, డొనాల్డ్‌ ట్రంప్, జో బైడెన్‌ల మధ్య ‘నువ్వా, నేనా’ అన్నట్లుగా హోరాహోరీ పోరు నడుస్తోంది. అలాంటప్పుడు అమెరికా ఎన్నికల ఫలితాలు బిహార్‌ పోలింగ్‌పై ఉండే ఆస్కారమే లేదు. కాకపోతే అమెరికాలోని భారతీయుల్లో మోదీ అభిమానులు, విధేయులు ఎక్కువ మంది ఉన్నందున వారి ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టడం ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని ఆశించి ట్రంప్‌ బోల్తా పడ్డారు.  (వైట్‌హౌస్‌ నుంచి వెళ్దాం: ట్రంప్‌తో భార్య మెలానియా)

అమెరికాలో ‘హౌడీ మోడీ, భారత్‌లో నమస్తే ట్రంప్‌’ పేరిట ఇరువు దేశాధినేతలు ప్రజలనుద్దేశించి మాట్లాడడం వెనక ఎన్నికల వ్యూహం ఉందనడంలో సందేహం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందర, నవంబర్‌ 3వ తేదీన అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రలు అనూహ్యంగా భారత్‌కు వచ్చి ‘2ప్లస్‌2’ చర్చల్లో భారత్‌తో భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం తెల్సిందే. ప్రవాస భారతీయ ఓట్లను ఆకర్షించడం కోసం ట్రంప్ చేసిన ఆఖరి ప్రయత్నంగా దాన్ని పేర్కొనవచ్చు. బైడన్, కమలా హ్యారిస్‌లకు ఓటేసిన ప్రవాస భారతీయులందరిని భారత వ్యతిరేకులుగా మోదీ విధేయులు సోషల్‌ మీడియా ద్వారా విమర్శిస్తున్నారు. వాస్తవానికి మోదీ విధేయులైన భారతీయులు కూడా అమెరికా ఎన్నికల్లో విడిపోయినట్లు, వారిలో ఎక్కువ మంది బైడెన్‌కు ఓటేయగా, తక్కువ మంది ట్రంప్‌కు వేసినట్లు అమెరికా ముందస్తు ఎన్నికల సందర్భంగా పలు మీడియా సంస్థలు నిర్వహించిన పోల్‌ సర్వేల్లో చెప్పారు. 

వచ్చే తరం ప్రవాస భారతీయులకు హెచ్‌ 1 బీ వీసాలు రాకపోయినా, వచ్చినా తమకు సంబంధం లేదని, తమకు పన్నులు తగ్గితే చాలనుకున్న మోదీ విధేయుల్లో ఓ వర్గం ట్రంప్‌కు ఓటేయగా, బైడెన్‌ అధికారంలోకి వస్తే భారతీయులపై శ్వేత జాతీయులు దాడులు తగ్గుతాయని, పైగా ప్రవాస భారతీయులుకు హెచ్‌ 1 బీ వీసాలు పెరగుతాయని భావించిన మోదీ విధేయుల్లో మరో వర్గం బైడెన్‌కు ఓటేశారు. బైడెన్‌ వస్తే అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ను కాకుండా పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తారంటూ మత విద్వేషకుల్లో ఓ వర్గం చేసిన ప్రచారం కూడా వారి ముందు పనిచేయలేదు. బైడెన్‌ కూడా అంతర్జాతీయ వ్యవహారాల్లో పాకిస్థాన్‌కు మద్దతిస్తానని చెప్పలేదు. కశ్మీర్‌ విషయంలో తన వైఖరి ఏమిటో చెప్పాల్సి వచ్చినప్పుడు తాను కశ్మీరీల పక్షమని బైడెన్‌ తెలిపారు. అంతమాత్రాన అది పాకిస్థాన్‌కు మద్దతివ్వడం ఎంతమాత్రం కాదు. (‘యునైటెడ్‌ స్టేట్స్‌’కు అధ్యక్షుడిని..!)

డొనాల్డ్‌ ట్రంప్‌ ఓడిపోవడం వల్ల భారతీయులుగానీ, ప్రవాస భారతీయులు బాధ పడాల్సిన అవసరం లేదని, ప్రవాస భారతీయులకుగానీ, భారతీయులకుగానీ జో బైడెన్‌ వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని, ఆయన ప్రవాస భారతీయులకిచ్చిన హామీలను మరచిపోరాదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భరోసా ఇస్తున్నారు. అయితే బైడెన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అమెరికాలోని కొన్ని చట్టాలను సవరించాలి. అందుకు అవసరమైన బలం సెనేట్‌లో బైడెన్‌కు లేదు. అలాంటప్పుడు అయన తన హామీలను ఎల నెరవేరుస్తారన్నది మరికొందరి విశ్లేషకుల అనుమానం. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. (ద్వైపాక్షిక బంధాలు బలపడతాయ్‌)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement