
74 మంది మృతి, 171 మందికి గాయాలు
దుబాయ్: యెమెన్లోని హౌతీ రెబల్స్ ఆదీనంలో ఉన్న చమురు నౌకాశ్రయంపై అమెరికా భీకర వైమానిక దాడులు జరిపింది. ఘటనలో 74 మంది చనిపోగా, 171 మంది గాయపడినట్లు హౌతీలు ప్రకటించారు. కాగా, హౌతీల లక్ష్యాలపై ట్రంప్ ప్రభుత్వం మార్చి 15 నుంచి కొనసాగిస్తున్న దాడుల్లో శక్తివంతమైంది ఇదేనని చెబుతున్నారు. గురువారం రాత్రి జరిగిన దాడితో రస్ ఇసా ఆయిల్ పోర్టులో భీకర శబ్ధాలతోపాటు భారీగా మంటలు వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దాడికి సంబంధించిన గ్రాఫిక్ ఫుటేజీని హౌతీలు విడుదల చేశారు. ఇరాన్ దన్నుతో చెలరేగుతున్న హౌతీల ప్రధాన ఆదాయ వనరును ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది. గత పదేళ్లుగా ఈ ప్రాంతంలో భయోత్పాతం సృష్టించే హౌతీలకు అక్రమ ఆదాయం అందకుండా చేయడానికే ఈ దాడుల లక్ష్యమని తెలిపింది. శాంతియుతంగా జీవించాలని కోరుకునే యెమెన్ ప్రజలకు హాని తలపెట్టడం తమ ఉద్దేశం కాదని పేర్కొంది. అమెరికా దాడిని హౌతీలు తీవ్రంగా ఖండించారు. ఇది యెమెన్ సార్వభౌమత్వంపై చేసిన దాడిగా పేర్కొన్నారు.