రష్యాలోకి ఉక్రెయిన్‌ సేన.. ఇరుపక్షాల భీకర యుద్ధం | Ukrainian army entered Russian territory | Sakshi
Sakshi News home page

రష్యాలోకి ఉక్రెయిన్‌ సేన.. ఇరుపక్షాల భీకర యుద్ధం

Aug 8 2024 7:22 AM | Updated on Aug 8 2024 9:22 AM

Ukrainian army entered Russian territory

రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొన్నేళ్లుగా యుద్ధం  నడుస్తోంది. అయితే ఇప్పుడు తొలిసారిగా ఉక్రేనియన్ సైన్యం రష్యాలోకి ప్రవేశించింది. దీంతో రష్యా అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్‌లో కలకలం చెలరేగింది. గత 36 గంటలుగా సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల సైన్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది.

దేశంలోని నైరుతి కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ చొరబాటును  కవ్వింపు చర్యగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు. సరిహద్దుల్లో జరుగుతున్న దాడులపై రష్యా స్పందిస్తోందని క్రెమ్లిన్ అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఉక్రెయిన్ అధికారులు మౌనంగా ఉన్నారు. ఈ చొరబాటు తర్వాత ఉక్రెయిన్ సైన్యం వివిధ ఆయుధాలతో రష్యన్ పౌర భవనాలు, నివాస భవనాలు, అంబులెన్స్‌లపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ విషయాన్ని పుతిన్ స్వయంగా తెలిపారు.

ఉక్రెయిన్ దాడి నేపధ్యంలో పుతిన్ అత్యున్నత రక్షణ, భద్రతా అధికారులతో సమావేశమయ్యారు. ఈ విషయంలో తగిన సమాధానం ఇవ్వాలని ఉక్రెయిన్ సైన్యాన్ని కోరారు. కుర్స్క్ ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రివర్గాన్ని ఆదేశించారు. మాస్కోకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఈ యుద్ధం జరుగుతోంది.

రష్యా ఆర్మీ చీఫ్ వాలెరీ గెరాసిమోవ్‌తో పుతిన్‌ కీలక సమావేశం నిర్వహించారు. ఈ యుద్ధంలో సుమారు 100 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందారని,200 మందికి పైగా గాయపడ్డారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. దీనికిముందు కుర్స్క్ తాత్కాలిక గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ మాట్లాడుతూ యుద్ధంలో గాయపడినవారి కోసం స్థానికులు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. తమ భూభాగంలోకి చొరబడి గత 36 గంటలుగా  దాడులకు తెగబడుతున్న ఉక్రేనియన్‌ సైన్యాన్ని రష్యా ఆర్మీ ధైర్యంగా తిప్పికొడుతున్నదన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement