మొన్నటివరకు రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడిచమురును దిగుమతి చేసుకున్న భారత్.. ఇప్పుడు అదే రష్యాకు పెట్రోల్ ఎగుమతి చేసే పరిస్థితి తలెత్తింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో తీవ్ర ఇంధన సంక్షోభంలో మునిగిపోయిన రష్యా.. తమకు అదనపు పెట్రోల్ సరఫరా చేయాల్సిందిగా భారత రిఫైనరీలను సంప్రదించినట్లు 'రాయిటర్స్' తమ కథనంలో పేర్కొంది.
ఇటీవల కాలంలో రష్యా ఇంధన మౌలిక వసతులే లక్ష్యంగా ఉక్రెయిన్ వరుస డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడుల ప్రభావం రష్యా చమురు శుద్ధి రంగంపై తీవ్రంగా పడింది. రష్యాకు చెందిన దాదాపు 40 శాతం చమురు శుద్ధి సామర్థ్యం ఉక్రెయిన్ దాడుల వల్ల దెబ్బతిన్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే భారత్ సాయాన్ని రష్యా కోరుతోంది. రోస్నెఫ్ట్ (Rosneft), గాజ్ప్రోమ్ నెఫ్ట్ (Gazprom Neft), లుకోయిల్ (Lukoil) వంటి రష్యా టాప్ ఎనర్జీ కంపెనీలు భారత రిఫైనరీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో ఈ ఒప్పందాలు కుదిరితే, ఇరు దేశాల మధ్య నేరుగా కాకుండా థర్డ్-పార్టీ ఇంటర్నేషనల్ ట్రేడర్ల ద్వారా ఈ ఇంధన సరఫరా జరుగుతుంది.
కాగా ఇప్పటికే ఒక పెట్రోల్ కార్గో భారత్ నుంచి రష్యాకు బయలు దేరినట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య సరఫరా ఒప్పందాలు కుదిరితే మరిన్ని షిప్మెంట్లు రష్యాకు వెళ్లే అవకాశం ఉంది.


