
ఇజ్రాయెల్ విశ్రాంతి లేకుండా విరుచుకుపడుతుంటే ఇరాన్ ఓవైపు ప్రతిదాడి చేస్తూనే మరోవైపు అణుపరీక్షలు జరిపిందన్న వార్తలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత? అనే ప్రశ్న వెంటనే తలెత్తింది. ఈ వార్తల్లో వాస్తవముందని వాదించే వాళ్లు రెండు అంశాలను తెరమీదకు తెచ్చారు. ఈ వారం మొదట్లో ఇరాన్లో రిక్టర్ స్కేల్పై 2.5 తీవ్రతతో ఒకసారి భూకంపం వచ్చింది.
తాజాగా శుక్రవారం 5.1 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. భీకరపోరు చేస్తున్న దేశంలో వెంటవెంటనే భూకంపాలు రావడం, అదికూడా అంతరిక్ష కేంద్రం, క్షిపణి ఉత్పత్తి కర్మాగారాలు ఉన్న సెమ్నాన్ ప్రావిన్సులోనే సంభవించడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి.
ఓవైపు అణుబాంబును తయారుచేసే స్థాయికి యురేనియంను ఇరాన్ ఇంకా శుద్ధిచేయలేదన్న వార్తలొస్తుండగా అణుపరీక్షల వేళ అణుబాంబు పేల్చడం వల్లే భూమి కంపించి అది రిక్టర్ స్కేల్పై నమోదైందని మరికొందరు వాదిస్తున్నారు. వీటిల్లో నిజమెంత అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అవి భూకంపనాలు కాదు, అణుబాంబు పేలుళ్లేనని నిర్దారణ అయితేగనక ప్రపంచంలో పదో అణ్వస్త్రదేశంగా ఇరాన్ అవతరించిందని భావించాల్సి ఉంటుంది. అప్పుడు అణ్వస్త్రదేశంపై దాడులను కొనసాగించడంపై ఇజ్రాయెల్, దానికి మద్దతు పలకడంపై అమెరికా పునరాలోచన చేయడం ఖాయం.
తొలుత ఫోర్డోలో.. తర్వాత సెమ్నాన్లో..
ఇజ్రాయెల్ క్షిపణిదాడుల తర్వాతే ఫోర్డోలో 2.5 తీవ్రతతో అదే రోజు భూకంపం సంభవించింది. ఇది జరిగిన ఐదు రోజులకు అంటే జూన్ 20వ తేదీ రాత్రి 9.19 గంటలకు ఉత్తర ఇరాన్లో 5.1 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. సెమ్నాన్కు ఆగ్నేయంగా 36 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 10 కి.మీ.ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
ఈ భూకంపం ధాటికి ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా సమీప ప్రాంతాల్లో భూమి బాగా కంపించింది. ఇదే సమయంలో నటాంజ్, ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ బాంబులవర్షం కురిపించింది. దీంతో ఈ అణుకేంద్రాలు దెబ్బతిన్నాయి. ప్రైవేట్ ఉపగ్రహ చిత్రాల్లో చూస్తే అణుకేంద్రాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోందిగానీ వినాశనానికి కారణం బాంబు దాడులా, అణుబాంబు పేలుళ్ల అనేది ఎవరికీ తెలీడం లేదు.
అవి నిజమైన భూకంపాలంటూ మరో వాదన
తాజా భూప్రకంపనలు కేవలం భూకంపాల కారణంగా సంభవించాయని, అణుపరీక్షలు జరగలేదని కొందరు వాదిస్తున్నారు. దీనికి చారిత్రక నేపథ్యం ఉంది. ఇరాన్ భౌగోళికంగా భూకంపాలు తరచూ సంభవించే ప్రాంతంలో ఉంది. ఆలై్ఫన్–హిమాలయన్ భూకంప పట్టీలో ఇరాన్ ఉంది. ఇక్కడ ఏటా సూక్ష్మస్తాయిలో ఏకంగా 2,000 భూకంపాలు వస్తాయి. రిక్టర్ స్కేల్పై 5 అంతకంటే ఎక్కువ తీవ్రతతో డజనుకుపైగా భూకంపాలు నమోదవుతాయి.
2006 నుంచి 2015 ఏడాదిదాకా గణాంకాలను పరిశీలిస్తే ఇరాన్లో 96,000 సార్లు భూకంపాలు వచ్చాయి. సాధారణంగా భూగర్భంలో అణుపరీక్షలు జరిపితే భూమి పైపై పొరలపై ఒత్తిడి కల్గి స్వల్పస్థాయిలో భూమి కంపిస్తుందని యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) పేర్కొంది. అణుబాంబు పేలిన కారణంగా మొదలయ్యే భూకంపం తీవ్రత కొంతదూరానికే పరిమితమవుతుంది.
అణుబాంబు పేలితే కేవలం పీ–బ్యాండ్ తరంగాలే ఉద్భవిస్థాయి. నిజంగా భూకంపం వస్తే పీ–బ్యాండ్తోపాటు ఎస్–బ్యాండ్ తరంగాలు కూడా వస్తాయి. ఎస్–బ్యాండ్ తరంగాలు తమ కేంద్రస్థానం నుంచి వెదజల్లబడి సూక్ష్మస్థాయిలో తిరిగి కేంద్రాన్ని చేరతాయి. పలు రకాల పరికరాల ద్వారా భూకంప శాస్త్రవేత్తలు దీనిని గుర్తించగలరు. ఈ లెక్కన 2.5 తీవ్రతతో వచ్చిన భూప్రకంపనలకు సహజ భూకంపమే కారణమని నిపుణులు నిర్ధారించారు. అయితే భూకంపం వచ్చిన అదే సమయానికి అదే ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులు చేయడం గమనార్హం
ఆపరేషన్ సిందూర్ వేళ..
మే నెలలో నాలుగురోజులపాటు పాకిస్తాన్పై భారత్ జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’భీకర దాడుల వేళ సైతం పాకిస్తాన్లో భూకంపాలు సంభవించాయి. దీంతో పాకిస్తాన్లో అణుపరీక్షలు జరిగాయనే వాదన వినిపించింది. అయితే ఆ వాదన తప్పు అని తర్వాత తేలింది. సమగ్ర అణ్వస్ర వ్యాప్తినిరోధక ఒప్పదం(సీటీబీటీఓ), యూఎస్జీఎస్, స్వతంత్య్ర భూగోళశాస్త్ర అధ్యయనకారుల వాదన ప్రకారం ఒకవేళ భూప్రకంపనలు నమోదైతే, వాటి కేంద్రాన్ని 10 కి.మీ.ల లోతులో గుర్తిస్తే అది ఖచ్చితంగా సహజ భూకంపమే. ఎందుకంటే పది కిలోమీటర్ల లోతుకు భూమిని తవ్వి అక్కడ అణుబాంబును పేల్చడం అసాధ్యం. శుక్రవారం నమోదైన భూకంపం సంబంధ నాభి స్థానాన్ని 10 కి.మీ.ల లోతులో గుర్తించారు. ఈ లెక్కన ఇరాన్లో అణుపరీక్షలు జరగలేదనే వాదన తాజాగా బలపడింది.
– సాక్షి, నేషనల్ డెస్క్