సానుకూల దిశగా చైనా-భారత్‌ సంబంధాలు | Trump Tariffs Row: EAM Jaishankar On India China Relations | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఎఫెక్ట్‌.. సానుకూల దిశగా చైనా-భారత్‌ సంబంధాలు

Apr 9 2025 3:42 PM | Updated on Apr 9 2025 4:12 PM

Trump Tariffs Row: EAM Jaishankar On India China Relations

న్యూఢిల్లీ, బీజింగ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా సుంకాల విధింపు తర్వాత స్టాక్‌ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి. ఈ క్రమంలో.. భారత్-చైనా సంబంధాలు(India-China Relations) బలపడే దిశగా అడుగులు పడుతుండడం గమనార్హం. 

తాజాగా ఇరు దేశాల సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌(Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. అవి సానుకూల దిశలో పయనిస్తున్నాయని అన్నారాయన. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే.. రెండు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

2020లో తూర్పు లడ్డాఖ్‌లోని గల్వాన్‌ లోయ(Galwan Valley)లో ఇరు దేశాల జవాన్ల మధ్య జరిగిన ఘర్షణతో సంబంధాలు దిగజారాయి. తర్వాత సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా కీలక గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు.

మరోవైపు.. ట్రంప్‌ టారిఫ్‌ల(Trump Tariffs) నేపథ్యంలో తొలిసారి స్పందించిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ స్పందించారు. పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని, సప్లై చైన్‌ వ్యవస్థలను మరింత మెరుగుపరచుకుంటామని అన్నారు.

అమెరికా చైనా మధ్య మరింత ముదిరిన టారిఫ్ వార్

చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 104 శాతం టారిఫ్‌లు ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో.. అమెరికా సుంకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌, చైనా జత కట్టాలని న్యూఢిల్లీలోని బీజింగ్‌ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్‌ అభిప్రాయపడ్డారు. ‘‘పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా సుంకాల వేధింపుల కారణంగా అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు.. అభివృద్ధి చెందే హక్కును కోల్పోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన రెండు దేశాలు కలిసి నిలబడాలి’’ అని ఆమె ఒక పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement