టార్గెట్‌ ‘ఫోర్డో’ | Special stoty on Iran Nuclear Facility Fordow | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ ‘ఫోర్డో’

Jun 20 2025 4:46 AM | Updated on Jun 20 2025 4:46 AM

Special stoty on Iran Nuclear Facility Fordow

ఇరాన్‌లోని ఆ అణుకేంద్రంపైనే ఇజ్రాయెల్‌ గురి  

ఉపరితలం నుంచి 90 మీటర్ల దిగువన అణు పరీక్షలు  

ధ్వంసం చేయాలంటే అమెరికా జీబీయూ–57 బాంబులే శరణ్యం  

అందుకే అమెరికాను యుద్ధంలోకి లాగుతున్న ఇజ్రాయెల్‌  

ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధం మొదలైన తర్వాత ఫోర్డో ఫ్యూయెల్‌ ఎన్‌రిచ్‌మెంట్‌ ప్లాంట్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇజ్రాయెల్‌ క్షిపణి దాడుల్లో ఇరాన్‌లోని నతాంజ్, ఇస్ఫహాన్‌ అణుశక్తి కేంద్రాలు చాలావరకు ధ్వంసమయ్యాయి. అక్కడ అణుబాంబులు తయారు చేసే పరిస్థితి లేకపోవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన అతిపెద్ద అణుకేంద్రం ఫోర్డో. అందుకే ఇజ్రాయెల్‌ సైన్యం దీనిపై గురిపెట్టింది.

 ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే ఫోర్డో అణుకేంద్రం గురించి స్పష్టంగా తెలిసిపోతోంది. కొండ చుట్టూ రహదారులు, సొరంగాల ప్రవేశ మార్గాలు, పక్కనే సహాయక భవనం, సెంట్రీఫ్యూజ్‌లు భద్రపర్చిన స్థలంగా భావిస్తున్న ప్రాంతం ఇందులో కనిపిస్తున్నాయి. పర్వతాల అంతర్భాగంలో అత్యంత దుర్భేద్యంగా నిర్మించిన ఫోర్డో న్యూక్లియర్‌ సైట్‌ను ధ్వంసం చేయాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం అమెరికానే.  

ఏమిటీ అణుకేంద్రం?  
అణు బాంబు తయారీపై ఇరాన్‌ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్‌ సహా పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకెళ్తోంది. బాహ్య ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ప్రయోగాలు కొనసాగిస్తోంది. ఇరాన్‌లో షియా ముస్లింల పవిత్ర నగరం ఖోమ్‌కు 20 మైళ్ల దూరంలోని ఫోర్డో అనే గ్రామం వద్ద కొండ కింద 80 నుంచి 90 మీటర్ల(262 నుంచి 295 అడుగుల) లోతున అణుకేంద్రం నిర్మించింది. దీని గురించి తొలిసారిగా 2009లో అందరికీ తెలిసింది. ఇరాన్‌ నుంచి కొన్ని కీలక డాక్యుమెంట్లను ఇజ్రాయెల్‌ నిఘా సంస్థలు చేజిక్కించుకోవడంతో ఫోర్డో గురించి కొంత సమాచారం బయటకు వచి్చంది. కానీ, 2002 నుంచే ఇక్కడ నిర్మాణాలు మొదలైనట్లు తెలిసింది. 

ఫోర్డోలో 2,700 సెంట్రీఫ్యూజ్‌లు  
ఫోర్డో కేంద్రంలో అణుబాంబు తయారీకి అవసరమైన సెంట్రీఫ్యూజ్‌లు 2,700 ఉన్నట్లు ఐఏఈఏ ఇటీవల తెలియజేసింది. 3,000 సెంట్రీఫ్యూజ్‌లు ఏర్పాటు చేసే వెసులుబాటు ఫోర్డోలో ఉంది. ఇరాన్‌ అణు శాస్త్రవేత్తలు ఇక్కడ యురేనియంను 60 శాతం వరకు శుద్ధిచేశారు. దాన్ని 90 శాతంగా మార్చడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడున్న యురేనియంను 233 కిలోల వెపన్‌–గ్రేడ్‌ యురేనియంగా మూడు వారాల్లో మార్చొచ్చు. 

9 అణు బాంబులు తయారు చేయడానికి ఈమాత్రం యురేనియం చాలు. అణ్వస్త్ర రహిత దేశమైన ఇరాన్‌ ఈ స్థాయిలో యురేనియం నిల్వ చేసుకోవడం ఆందోళనకరమని ఐఏఈఏ ఈ ఏడాది మే 31న పేర్కొంది. అణు బాంబు తయారీకి ఇరాన్‌ అత్యంత చేరువలోకి రావడమే ఇజ్రాయెల్‌ భయానికి అసలు కారణం. ఫోర్డో అణుకేంద్రాన్ని సర్వనాశనం చేస్తే తప్ప తమ భద్రతకు ఢోకా ఉండదని ఇజ్రాయెల్‌ చెబుతోంది. కానీ, అది ఇజ్రాయెల్‌ వల్ల సాధ్యమేనా?  

ప్రత్యామ్నాయ మార్గం ఇదే..  
ఒకవేళ ఫోర్డోను పూర్తిగా నామరూపాల్లేకుండా చేయడం సాధ్యం కాకపోతే కనీసం నిరీ్వర్యం చేయడానికి ఒక అవకాశం ఉంది. అది ఏమిటంటే.. అణుకేంద్రం లోపలికి దారితీసే సొరంగాల ఎంట్రన్స్‌లను ధ్వంసం చేయడం. అలాగే గాలి ప్రసరణ కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను దెబ్బతీయొచ్చు. సొరంగాలు, విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేస్తే లోపల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.

 అణుబాంబు ప్రయోగాలు హఠాత్తుగా ఆగిపోవచ్చు. దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించుకోవాలంటే చాలా సమయమే పడుతుంది. ఇరాన్‌ అణుశక్తి ప్రయోగాల్లో ఫోర్డో న్యూక్లియర్‌ సెంటర్‌ అత్యంత కీలకంగా మారింది. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలోకి అమెరికాను సైతం ఎలాగైనా లాగడానికి ఇజ్రాయెల్‌ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఫోర్డో అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడమేనని తెలుస్తోంది. 

ఏకైక అస్త్రం జీబీయూ–57 పెనిట్రేటర్‌ బాంబు
ఉపరితలం నుంచి 90 మీటర్ల లోతులో రాతికొండల కింద ఉన్న అణుశక్తి కేంద్రాన్ని ధ్వంసం చేయాలంటే సాధారణ క్షిపణులు, డ్రోన్లు, బాంబులు సరిపోవు. దానికి శక్తివంతమైన బాంబు కావాలి. ఇది అమెరికా వద్ద మాత్రమే ఉంది. ఈ విషయాన్ని అమెరికాలోని ఇజ్రాయెల్‌ రాయబారి యెచీల్‌ లీటెర్‌ స్వయంగా చెప్పారు. సొంతంగా పనిపూర్తి చేసే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు లేదు కాబట్టి అమెరికాపై ఆధారపడక తప్పదు. అమెరికా వద్ద జీబీయూ–57 ఆర్డినెన్స్‌ పెనిట్రేటర్‌ బాంబులు ఉన్నాయి. 

ఇవి భూమిలోకి దూసుకెళ్లి పేలుళ్లు సృష్టిస్తాయి. ఒక్కో బాంబు 60 మీటర్ల లోతు వరకు దూసుకెళ్లగలదు. అమెరికా వైమానిక దళానికి చెందిన బి–2 స్టెల్త్‌ బాంబర్ల ద్వారా జీబీయూ–57 బాంబులను ప్రయోగించాల్సి ఉంటుంది. ఫోర్డో న్యూక్లియర్‌ సెంటర్‌ను ధ్వంసం చేయాలంటే కేవలం ఒక్క బాంబు సరిపోదు. ఒకేచోట వెన్వెంటనే కనీసం రెండు బాంబులు ప్రయోగిస్తేనే ఆశించిన ఫలితం ఉంటుంది. మొదటి బాంబు 60 మీటర్ల వరకు వెళ్లి పేలుడు జరిగిన వెంటనే మరో బాంబును ప్రయోగించాలని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. రిపీటెడ్‌ స్ట్రైక్స్‌ తప్ప మరో మార్గం లేదని అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ మాజీ కల్నల్‌ సెడ్రిక్‌ లైటన్‌ తెలిపారు.   

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement