బంగ్లాలో దాడులకు పాకిస్థానే కారణం: హసీనా కుమారుడు | Sheikh Hasina Son Sajeeb Wazed Key Comments Over Bangladesh Attacks | Sakshi
Sakshi News home page

బంగ్లాలో దాడులకు పాకిస్థానే కారణం: హసీనా కుమారుడు

Aug 8 2024 5:21 PM | Updated on Aug 8 2024 5:36 PM

Sheikh Hasina Son Sajeeb Wazed Key Comments Over Bangladesh Attacks

ఢాకా: బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశం విడిచివెళ్లడంతో అక్కడ సైనిక పాలన కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో ఈ నేపథ్యంలో షేక్‌ హసీనా కుమారుడు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనంతరం షేక్‌ హసీనా తిరిగి స్వదేశానికి వస్తారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో​ తమ దేశంలో ఈ పరిస్థితికి పాకిస్తానే కారణమని సంచలన ఆరోపణలు చేశారు.

ఇక, తాజాగా షేక్‌ హసీనా కుమారుడు సాజీబ్‌ వాజెద్‌ జాయ్‌ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొనసాగుతున్న అనిశ్చితికి పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఆజ్యం పోస్తోంది. విదేశీ జోక్యంతోపాటు పాక్‌ ఐఎస్‌ఐ ప్రమేయం ఉందని చెప్పడానికి క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న ఘర్షణలే ఆధారాలు. దాడులు, ఆందోళనలు చాలా సమన్వయంతో, పక్కా ప్రణాళికతో జరిగినట్లు తెలుస్తోంది. వాటిని రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగానే సోషల్‌ మీడియాలో ప్రయత్నాలు జరిగాయి. పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా.. వాటిని మరింత దిగజార్చేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. ఉగ్రవాద, విదేశీ శక్తులు మాత్రమే సమకూర్చగలిగే ఆయుధాలతో అల్లరిమూకలు పోలీసులపైనే దాడులు చేసిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఈ అరాచకం నుంచి బంగ్లాదేశ్‌ను రక్షించేందుకు సాధ్యమైనంత కృషి చేస్తాను అని కామెంట్స్‌ చేశారు.

ఇదే సమయంలో భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన తల్లికి రక్షణ కల్పించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. మరోవైపు.. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనంతరం షేక్‌ హసీనా తిరిగి స్వదేశానికి వస్తారని సాజీబ్‌ చెప్పుకొచ్చారు. మా పార్టీ వాళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఆపదలో ఉన్న  పౌరులను, అవామీ లీగ్‌ పార్టీని షేక్‌ ముజిబర్‌ రహ్మాన్‌ కుటుంబం ఎన్నటికీ ఒంటరిగా వదలిపెట్టదు. బంగ్లాదేశ్‌లో అవామీ పార్టీకి ఎంతో చరిత్ర ఉంది. అందుకే ఆమె ఆమె తప్పకుండా తిరిగి వస్తారు అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement