
ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్((Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మస్క్.. ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
తన ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించి ఆయన ఓ పోస్ట్ చేశారు. ‘‘అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసింది’’ అని పోస్టులో పేర్కొన్నారాయన. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆకాంక్షించారు.
As my scheduled time as a Special Government Employee comes to an end, I would like to thank President @realDonaldTrump for the opportunity to reduce wasteful spending.
The @DOGE mission will only strengthen over time as it becomes a way of life throughout the government.— Elon Musk (@elonmusk) May 29, 2025
ట్రంప్ ఈ మధ్యకాలంలో తీసుకున్న నిర్ణయాలపై మస్క్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజా పన్నులు, వ్యయాల బిల్లులను తప్పు బట్టిన ఆయన.. ట్రిలియన్ డాఆర్ల పన్నులు వేయకపోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే.. రక్షణ రంగంపై వ్యయం పెంచడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో ట్రంప్ విధానాలు సరికావంటూ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంతోనే ఆయన బాధ్యతల నుంచి తప్పుకుని ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయం నుంచే ఎలాన్ మస్క్ను తన పాలక వర్గంలోకి తీసుకుంటానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక మస్క్ను డోజ్ శాఖకు సారథిగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్’ ప్రాజెక్టు లక్ష్యమని, తన ప్రభుత్వంలో సమర్థత పెంచేందుకు ఈ విభాగం కృషి చేస్తుందని ఆ టైంలో ట్రంప్ ప్రకటించారు.

ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వశాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ విభాగం పనిచేసింది. ఈ క్రమంలో.. అటు డెమోక్రట్ల నుంచి మాత్రమే కాదు, ఇటు రిపబ్లికన్ల నుంచి కూడా మస్క్ వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అయితే దీర్ఘకాలిక అభివృద్ధి కావాలంటే.. కొన్నింటిని వదులుకోవాలని మస్క్ తన చర్యలను సమర్థించుకున్నారు.
ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులకు కత్తెర, దుబారా ఖర్చులకు కోత, అవినీతి నిర్మూలన, ఫెడరల్ సంస్థలను పునర్మిర్మాణం.. ఇవన్నీ డోజ్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. 2026 జులై 4వ తేదీలోపు మొత్తం ఫెడరల్ బ్రూరోక్రసీని ఇది ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఆ తర్వాత డోజ్ దానికదే ఎక్స్పైరీ కానుంది. మస్క్ నిర్ణయంతో డోజ్కు ట్రంప్ కొత్త సారథిని నియమిస్తారా? లేదంటే ఆ వ్యవస్థను రద్దు చేస్తారా? అనేది వేచి చూడాలి.
ఇదీ చదవండి: యువ పార్లమెంటేరియన్తో సీనియర్ అనుచిత ప్రవర్తన!