
పశ్చిమ దేశాలపై పుతిన్ ఆగ్రహం
మాస్కో: రష్యా ఆందోళనను పట్టించుకోకుండా పశ్చిమదేశాలు విస్తరణ వాదాన్ని అనుసరిస్తున్నాయని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. తమ దేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. శుక్రవారం పుతిన్ బెలారస్ రాజధాని మిన్స్క్లో జరిగిన యురేసియన్ ఎకనామిక్ సమిట్(ఈఏఈయూ)కు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రష్యాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు, కాల్పులకు తెగబడుతున్నా ఎవరూ పట్టించుకోరు.
ఇప్పటికీ దారుణాలు కొనసాగుతున్నా వాటి గురించి మాట్లాడరు. అంతా బాగుందని చెప్పుకుంటుంటారు’అంటూ పశ్చిమదేశాలపై పుతిన్ ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని సైతం రష్యాలో వేర్పాటువాదానికి ఒక సాధనంగా పశ్చిమ దేశాలు భావించాయని ఆరోపించారు. ‘నాటో విస్తరణకు సంబంధించి రష్యాకు ఇచ్చిన హామీలను పశ్చిమదేశాలు విస్మరించాయి. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో సైతం విఫలమయ్యాయి.
ఉక్రెయిన్లో మేం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ మూలాలేమిటనే అంశంపై పశ్చిమ దేశాలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఉక్రెయిన్ సంక్షోభానికి దశాబ్దాల క్రితమే బీజాలు పడ్డాయి. నాటో విస్తరణ విషయంలో చెప్పిన పచ్చి అబద్ధాలే తాజా సమస్యకు కారణం. ఒకదాని తర్వాత మరో దేశాన్ని నాటోలోకి కలుపుకుంటూ విస్తరించుకుంటూ వస్తున్నాయి.
మా ఆందోళనలను పట్టించుకోకుండా నాటో కార్యకలాపాలు యథా ప్రకారం కొనసాగిస్తోంది. ఇది కాదా దుందుడుకు వైఖరి? ఇది కచ్చితంగా దుందుడుకు విధానమే. పశ్చిమ దేశాలు దీనిపై దృష్టి పెట్టడానికి ఇష్టపడవు’అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్తో మూడేళ్లుగా సాగిస్తున్న యుద్ధంపై పశ్చిమ దేశాలతో రష్యాకు విభేదాలు తీవ్రతరమైన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రష్యా దూకుడును నిలువరించేందుకు సభ్య దేశాలు తమ జీడీపీలో 5 శాతం రక్షణకు కేటాయించాలంటూ నాటో ఇటీవల నిర్ణయించడం తెల్సిందే.