
వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి
భారత ప్రధాని మోదీ, సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్ పిలుపు
నికోసియా: పశ్చియాసియా, యూరప్లో జరుగుతున్న యుద్ధాలు, సంఘర్షణలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇది యుద్ధాల యుగం కాదని తేల్చిచెప్పారు. వివాదాలు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధాలకు ముగింపు పలకాలని కోరారు. సోమవారం సైప్రస్ రాజధాని నికోసియాలో మోదీ, నికోస్ సమావేశమయ్యారు.
భారత్–సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. రక్షణ, వ్యాపారం, వాణిజ్యం, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరులు, వాతావరణ మార్పులు తదితర కీలక అంశాలపై సంప్రదింపులు జరిగాయి. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. పశ్చిమాసియా, యూరప్లో కొనసాగుతున్న యుద్ధాల ప్రభావం ప్రపంచమంతటా ఉంటుందని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు.
ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని శాంతి, స్థిరత్వం కోసం అన్ని దేశాలూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. సంఘర్షణలకు తెరదించడానికి చర్చలు, సంప్రదింపులే మార్గమని పునరుద్ఘాటించారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించిన సైప్రస్కు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్–సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన అధ్యాయాన్ని లిఖించడానికి ఈ పర్యటన తనకు ఒక సువర్ణ అవకాశమని మోదీ వ్యాఖ్యానించారు. రెండు దేశాల సంబంధాలకు ప్రజాస్వామ్యం పట్ల పరస్పర విశ్వాసం, చట్టబద్ధమైన పాలనే పునాది అని స్పష్టంచేశారు. భారత్లో పర్యటించాలని సైప్రస్ అధ్యక్షుడిని మోదీ ఆహా్వనించారు.
దురాక్రమణకు చరమగీతం పాడాలి: నికోస్
భారత్–సైప్రస్ మధ్య చరిత్రాత్మక స్నేహ సంబంధాలు ఉన్నాయని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ గుర్తుచేశారు. విశ్వాసమే ప్రాతిపదికగా రెండు దేశాల నడుమ ఆతీ్మయ సంబంధాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఏప్రిల్ 22న జమ్మూకశీ్మర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినట్లు గుర్తుచేశారు. అంతకుముందు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కు చేరుకున్న మోదీ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగాకౌన్సిల్ ఆఫ్ నికోసియా సభ్యుడు మైఖేలా ఖైత్రియోటి మలాపా.. మోదీ పాదాలకు నమస్కరించారు.
వ్యాపారాభివృద్ధికి అద్భుత అవకాశాలు
భారత్ త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని నరేంద్ర మోదీ వెల్లడించారు. వ్యాపారాభివృద్ధికి తమ దేశంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని, పెట్టుబడులతో ముందుకు రావాలని సైప్రస్ ఇన్వెస్టర్లకు, పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సైప్రస్ దక్షిణ కోస్తాతీరంలోని లిమాసోల్ సిటీలో బిజినెస్ రౌండ్టేబుల్ సమావేశంలో మోదీ మాట్లాడారు. గత 11 ఏళ్లలో ఇండియా సాధించిన ఆర్థిక ప్రగతిని వివరించారు.
మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం
ప్రధాని మోదీని సైప్రస్ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్–3’ని మోదీకి ప్రదానం చేశారు. భారత్–సైప్రస్ మధ్య స్నేహబంధానికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని అభివరి్ణంచారు. వసుధైక కుటుంబం అనే భావనకు ఈ పురస్కారం ఒక ప్రతీక అన్నారు. రాబోయే రోజుల్లో మన రెండు దేశాల మధ్య క్రియాశీల భాగస్వామ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంటుందన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు.