భారత్, గయానా మధ్య బలమైన బంధం | PM Narendra Modi attends an Indian community programme in Georgetown, Guyana | Sakshi
Sakshi News home page

భారత్, గయానా మధ్య బలమైన బంధం

Nov 23 2024 4:39 AM | Updated on Nov 23 2024 4:39 AM

PM Narendra Modi attends an Indian community programme in Georgetown, Guyana

సంస్కృతి, వంటలు, క్రికెట్‌ ఇరు దేశాలను అనుసంధానిస్తున్నాయి  

గయానాలో ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ 

జార్జిటౌన్‌: భారత్, గయానా మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయని, రెండు దేశాలను సంస్కృతి, వంటలు, క్రికెట్‌ అనుసంధానిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రెండు దేశాల నడుమ ఉన్న సారూప్యతలు బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొ న్నారు. గయానా రాజధాని జార్జిటౌన్‌లో స్థానిక కాలమానం ప్రకారం గురువారం భారత సంతతి ప్రజలు, ప్రవాస భారతీ యుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 

కరీబియన్‌ దేశమైన గయానా అభివృద్ధిలో ఇండో–గయానీస్‌ సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. భారత్, గయానా పరస్పరం పంచుకుంటున్న విలువలే ఇరు దేశాల మధ్య బంధానికి బలమైన  పునాదిగా మారాయని వివరించారు. సుసంపన్నమైన, విశిష్టమైన సంస్కృతి ఇరు దేశాలకు గర్వకారణంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. మన సాంస్కృతిక వైవిధ్యమే మన బలం అని ప్రధానమంత్రి  పేర్కొన్నారు.

 క్రికెట్‌ క్రీడ పట్ల ఉన్న ప్రేమ భారత్‌–గయానాను ఒక్కటిగా కలిపి ఉంచుతోందని తెలిపారు. క్రికెట్‌ అంటే ఒక జీవన విధానమని వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌ల్లో భారత జట్టుకు గయానా ప్రజలు మద్దతు తెలిపారని గుర్తుచేసుకున్నారు. ప్రవాస భారతీయులను ‘రాష్ట్రదూతలు’గా ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత సంస్కృతి, విలువలకు వారు రాయబారులని కొనియాడారు. 

ఇండో–గయానీస్‌ ప్రజలు రెండు రకాలుగా ఆశీస్సులు పొందారని, వారికి గయానా మాతృభూమి అయితే భారతమాత ప్రాచీన భూమి అని వివరించారు. రెండు దశాబ్దాల క్రితం ఒక యాత్రికుడిగా గయానాలో పర్యటించానని, అప్పటితో పోలిస్తే దేశం ఇప్పుడు దేశం చాలా మారిపోయిందని చెప్పారు. గయానా ప్రజల ప్రేమ, ఆప్యాయ తల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఉద్ఘాటించారు. 

స్వదేశానికి మోదీ:  నైజీరియా, బ్రెజిల్, గయానాల్లో ఐదు రోజుల పర్యటన ముగించుకొని మోదీ శుక్రవారం భారత్‌ చేరుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement