ఎడారిలో ‘ఫ్యూయల్ రైడర్స్’.. ప్రతీ ట్రిప్ ఓ సవాలే.. | Beneath 50°C Heat, Pakistan Bikers Risk Lives Smuggling Iranian Fuel Across The Border, Check Out Temperature Details | Sakshi
Sakshi News home page

ఎడారిలో ‘ఫ్యూయల్ రైడర్స్’.. ప్రతీ ట్రిప్ ఓ సవాలే..

Jun 17 2026 12:15 PM | Updated on Jun 17 2026 12:44 PM

Pakistan bikers battling extreme heat smuggle Iran fuel

ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. ఎడారి గాలులు శరీరాన్ని కాల్చేస్తున్నాయి. ఒకవైపు సాయుధ ఘర్షణలు, మరోవైపు భద్రతా బలగాల తనిఖీలు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రతిరోజూ వందలాది బైకర్లు ఇరాన్-పాకిస్తాన్‌ సరిహద్దు మీదుగా పెట్రోల్, డీజిల్‌ను తరలిస్తూ జీవన పోరాటం సాగిస్తున్నారు. ఇది కేవలం అక్రమ రవాణా కథ కాదు. పేదరికం, నిరుద్యోగం, సరిహద్దు ప్రాంతాల నిర్లక్ష్య అభివృద్ధి రాసిన ఒక విషాద గాథ.

ఇరాన్-పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం వేలాది మంది యువకులు ఇదే జీవితాన్ని గడుపుతున్నారు. ఇరాన్‌లో తక్కువ ధరకు లభించే ఇంధనాన్ని పాకిస్తాన్‌‌కు తరలిస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. చట్టపరంగా ఇది అక్రమ రవాణాగా పరిగణించబడుతున్నప్పటికీ, స్థానికుల దృష్టిలో ఇది బతికే మార్గం. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌ మరియు ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంతాల మధ్య దాదాపు 900 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఈ ప్రాంతం ఎడారులు, కొండలు, నిర్జన మార్గాలతో నిండి ఉంటుంది. అధికారిక వాణిజ్య అవకాశాలు తక్కువగా ఉండటంతో వేలాది మంది స్థానికులు ఇంధన రవాణాపైనే ఆధారపడుతున్నారు.

ఇరాన్‌లో ప్రభుత్వ సబ్సిడీల కారణంగా ఇంధన ధరలు తక్కువగా ఉంటాయి. అదే ఇంధనాన్ని పాకిస్తాన్‌లో విక్రయిస్తే మంచి లాభం వస్తుంది. ఈ ధరల వ్యత్యాసమే భారీ స్థాయిలో ఇంధన రవాణాకు కారణమైంది. సరిహద్దు ప్రాంతాల్లోని డిపోల నుంచి పెట్రోల్, డీజిల్‌ను జెర్రీ క్యాన్లలో నింపుకుని బైక్‌లకు కట్టుకొని ప్రయాణించడం అక్కడ సాధారణ దృశ్యంగా మారింది. ఒక్కో బైక్‌పై అనేక క్యాన్లలో వందల లీటర్ల ఇంధనాన్ని మోస్తారు. ఇంధనం బరువుతో బైక్ నియంత్రణ కోల్పోతే ప్రమాదం తప్పదు. చిన్న స్పార్క్ వచ్చినా అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కుటుంబ పోషణ కోసం ఈ ప్రమాదాలను లెక్కచేయకుండా యువకులు ఈ పనిలో కొనసాగుతున్నారు.

ఈ ప్రాంతంలో పరిస్థితులను మరింత క్లిష్టం చేస్తున్నది భద్రతా సమస్య. బలూచ్ సాయుధ గ్రూపుల కార్యకలాపాలు, భద్రతా దళాల ఆపరేషన్లు, సరిహద్దు పర్యవేక్షణ కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు కాల్పులు, అరెస్టులు, వాహనాల స్వాధీనం వంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి. అయినప్పటికీ జీవనోపాధి కోసం ప్రజలు ఈ మార్గాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు.

నిపుణుల అంచనా ప్రకారం రోజుకు లక్షల లీటర్ల నుంచి మిలియన్ల లీటర్ల వరకు ఇరానియన్ ఇంధనం వివిధ మార్గాల ద్వారా పాకిస్తాన్‌లోకి చేరుతోంది. గతంలో వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం రోజుకు సుమారు 5 నుంచి 6 మిలియన్ లీటర్ల ఇంధనం అక్రమ మార్గాల్లో పాక్‌లోకి ప్రవేశించిన సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యాపారంలో వేలాది వాహనాలు, పడవలు, బైకులు పాల్గొంటున్నట్లు అంచనాలు ఉన్నాయి. పాక్‌ ప్రభుత్వం ఈ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, స్థానికుల జీవనాధారం దీనిపైనే ఆధారపడటంతో సమస్య సంక్లిష్టంగా మారింది. అధికారుల దృష్టిలో ఇది స్మగ్లింగ్. కానీ సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజల దృష్టిలో ఇది ఆకలి నుంచి బయటపడే మార్గం.

ఇటీవలి కాలంలో మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇరాన్‌పై ఆంక్షలు, ఇంధన సరఫరా సమస్యలు ఈ వ్యాపారాన్ని మరింత ప్రాధాన్యంగా మార్చాయి. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఆంక్షల వల్ల నష్టపోయిన ఇరాన్‌కు ఇది అదనపు ఆదాయ మార్గంగా మారగా, పాకిస్తాన్‌లోని పేద ప్రాంతాలకు చౌకైన ఇంధనం అందించే వ్యవస్థగా కొనసాగుతోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement