
16 మంది దుర్మరణం
అబూజ: నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో ఒక దుకాణసముదాయంలో అమర్చిన బాంబు పేలిన ఘటనలో 16 మంది చనిపోయారు. డజన్ల మంది గాయపడ్డారు. బుధవారం ఉదయం 8 గంటలకు కవోరీ ప్రాంతంలోని ఒక టీ దుకాణంలో ఈ పేలుడు సంభవించింది. దాడి చేసింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థా ప్రకటించుకోలేదు.
కానీ చాన్నాళ్లుగా పలు దాడులకు కారణమైన బోకో హరామ్ ఉగ్రసంస్థే ఈ దాడికి పాల్పడి ఉంటుందని స్థానిక అధికారులు అనుమానిస్తున్నారు. బోకో హరామ్, దాని చీలిక వర్గం ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ల దాడులు, అంతర్యుద్ధం కారణంగా నైజీరియా, కామెరూన్, నైజర్, చాద్ దేశాల్లో గత 15 సంవత్సరాల్లో 35,000 మందికిపైగా ప్రజలు చనిపోయారు.