
ఏరా బుడ్డోడా ఆదుకోవడం లేదురా అని అడిగితే అమ్మ ఫోన్ ఇవ్వడం లేదన్నా అన్నాడు ఓ పిల్లాడు. అది కాదురా ఆదుకోవడం అంటే గ్రౌండ్లో ఆదుకోవడం ఫోన్లో కాదురా అని ఆ పెద్దాయన వాడికి సర్దిచెప్పాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆటలు అంటే ఫోన్లో.. సినిమా అంటే ఫోన్లో.. కబుర్లు అంటే ఫోన్లో.. అన్నీ ఫోన్లోనే నడుస్తున్నాయి.. ఆఖరుకు పిల్లలకు ఫోన్ చూపిస్తే తప్ప బువ్వ కూడా తినని పరిస్థితి. ఉగ్గు తినిపిస్తూ కూడా ఫోన్లో వీడియోలు చూపిస్తున్న తల్లులున్న కాలమిది.
ఏ బస్సుల్లో.. ట్రైన్లలో.. పెళ్లి పేరంటాళ్లలో చూస్తున్నా పిల్లలు ఆటపాటలు కాకుండా ఫోన్లలోనే కనిపిస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి పిల్లలను బయటకు తీసుకొచ్చి వారిని సొంతంగా ఆలోచించడం.. ఆడుకోవడం వంటి పనుల్లో పెట్టడం తల్లిదండ్రులకు పెద్ద టాస్క్ అయిపొయింది. స్కూళ్లలో కూడా పిల్లలు నిత్యం ఫోన్లు చూస్తున్నారు. అటు క్లాసులు నడుస్తుంటే ఇటు వెనుకబెంచిలో ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ ఫోన్ మానియా నుంచి పిల్లలను బయటకు తెచ్చి ఎక్కువసేపు పుస్తకాలతో గడిపేలా చేసేందుకు తల్లిదండ్రులు.. టీచర్స్ కూడా యాతనపడుతున్నారు.
ఈ క్రమంలో స్కాట్లాండు లోని ఎడిన్బర్గ్ పట్టణంలో రెండు సెకండరీ పాఠశాలల్లో మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే పిల్లలను ఫోన్ల నుంచి మరల్చేందుకు సరికొత్తగా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పోర్టోబెల్లో హై స్కూల్ , క్వీన్స్ఫెర్రీ హై స్కూల్ లో ఈ కొత్త ప్రక్రియ మొదలు పెడుతున్నారు. అలాగని పిల్లల నుంచి ఫోన్లు లాక్కోవడం వంటి బలవంతపు చర్యలు వంటివి ఉండవు.. ఫోన్లు వాళ్ళచేతుల్లోనే ఉంటాయి.. కానీ చూడకూడదు.. అదన్నమాట సరికొత్త డీ అడిక్షన్ కాన్సెప్ట్. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రతిరోజు ఉదయం పాఠశాలకు వచ్చిన వెంటనే తమ ఫోన్లను యోండ్ర్ పౌచ్ల (Yondr pouches) లో భద్రంగా పెట్టాలి.
విద్యార్థులందరూతమ మొబైల్ ఫోన్లను లాక్ చేయగలిగే మరియు మాగ్నెటిక్గా ఓపెన్ చేసే ప్రత్యేక పౌచ్లలో ఉంచాలి. ఈ పౌచ్లు వారి దగ్గరే ఉంటాయి కానీ స్కూల్ టైం మొత్తం వాటిని ఓపెన్ చేయలేరు. ఈ పాలసీని అమలు చేయడానికి ముందు 6 నెలలపాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, సంరక్షకులతో చర్చలు జరిగాయి. ప్రత్యేకమైన గ్రూపులు ఏర్పాటు చేయగా, పోర్టోబెల్లో హై స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో 86% మంది ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ ప్రక్రియవలన పిల్లల్లో మరింత హుషారు.. ఉత్సాహాన్ని నింపడానికి అవకాశం కలుగుతుందని అంటున్నారు. దీంతోబాటు పిల్లలు తమ క్లాస్మేట్స్ తో ఎక్కువసేపు గడపడం.. మాట్లాడడం.. ఆటపాటల్లో నిమగ్నం కావడం వంటి పనుల్లో నిమగ్నం అవుతారని టీచర్లు అంటున్నారు.
అధ్యయనాల ప్రకారం, ఫోన్-ఫ్రీ వాతావరణం విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అంటున్నారు. ఈ సరికొత్త విధానం గురించి కౌన్సిలర్ జోన్ గ్రిఫిత్ మాట్లాడుతూ "విద్యార్థులకు పాఠశాల సమయాల్లో మొబైల్ ఫోన్లను దూరంగా ఉంచే విధానం ప్రారంభించడం అనందంగా ఉంది. పిల్లలు క్లాసురూముల్లో టీచర్ల మీద.. వారు చెప్పే పాఠాల మీద దృష్టి పెట్టకుండా ఫోన్లు చూస్తున్నారు. ఇది వారి విజ్ఞానాన్ని.. తెలివిని దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఫోన్లకు తాళం వేయడంతో పిల్లలు క్లాసురూముల్లో ఏకాగ్రతతో పాఠాలు వింటారు' అన్నారు.
-సిమ్మాదిరప్పన్న