అభివృద్ధి రెండువైపులా పదునైక కత్తిలాంటిది. అది మంచి చేస్తామని చెబుతూనే తరతరాలుగా బతుకున్న నేలను నెమ్మదిగా ఆక్రమిస్తుంది. చివరకు మనుషులనే కాదు, జంతువులను తన నేలను తనకే పరాయిని చేస్తుంది. పర్యాటకం కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందంటారు. కానీ కొన్నిసార్లు ఆ అవకాశం కనబడకుండానే కబళించేస్తుంది. దాన్ని అందుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు మసాయి మారాలో ఈ రెండు ప్రక్రియలు.. మొత్తంగా పర్యావరణాకి, స్థానిక సమాజాలకు ముప్పు తెచ్చిపెట్టాయి.
మసాయి మారా. కెన్యాలో అత్యంత ప్రసిద్ధ వన్యప్రాణుల అభయారణ్యం. అద్భుతమైన, వైవిధ్యభరితమైన అనేక జాతులకు అందమైన నిలయం. ఆఫ్రికాలోని సుప్రసిద్ధ సఫారీ గమ్యస్థానాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం, లక్షలాది మంది సందర్శకులు ఈ అభయారణ్యానికి వస్తారు. 1960వ దశకంలో ఈ రిజర్వ్ను స్థాపించినప్పటి నుంచి ఈ ప్రాంతానికి వచ్చే సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో కెన్యా ఆర్థిక వ్యవస్థకు మిలియన్ల డాలర్లు సమకూరుతున్నాయి.
స్థానికులకు ఉద్యోగాలతోపాటు, స్థానిక వ్యాపారాలు లబి్ధపొందుతున్నాయి. ఈ లాభాలపై బహుళ జాతి కంపెనీలు, ఇంటర్నేషనల్ లగ్జరీ హోటల్స్ కన్ను పడింది. అభయారణ్యం అంతటా విస్తరిస్తున్న విలాసవంతమైన శిబిరాలు, లాడ్జీలు పర్యావరణ వ్యవస్థపై ఆందోళనలు పెంచుతున్నాయి. అనియంత్రిత అభివృద్ధి వన్యప్రాణుల ఆవాసాలను దెబ్బతీస్తోందని, టాంజానియాలోని సెరెంగెటి నేషనల్ పార్క్, కెన్యాలోని మసాయి మారా నేషనల్ రిజర్వ్ మధ్య జరిగే వన్యప్రాణుల వలసకు ముప్పు కలిగిస్తోందని పర్యావరణ పరిరక్షకులు హెచ్చరిస్తున్నారు.
దశాబ్దాలుగా, మసాయి మారా కెన్యా ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉంది. పర్యాటకం నిస్సందేహంగా కెన్యా ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భాగం. ఇది ఏటా బిలియన్ల షిల్లింగ్లను ఆర్జిస్తూ, సఫారీ గైడ్లు, హోటల్ కారి్మకులు, రవాణా నిర్వాహకులు, హస్తకళల విక్రేతలు, మసాయి వర్గాల వంటి వేలాది మందికి ఉద్యోగాలను కల్పిస్తోంది. అయితే, ఈ పర్యాటకం, అభివృద్ధి వల్ల నష్టాలు కలుగుతున్నాయి.
వలస మార్గాల సమీపంలో జరుగుతున్న నిర్మాణాలు, వాహనాల రద్దీ, మానవ కార్యకలాపాలు జంతువుల కదలికలకు అంతరాయం కలిగిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమైన వన్యప్రాణులపై ఇవి అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయి. జంతువులను వేటాడేందుకు సఫారీ వ్యాన్లు వాటి చుట్టూ గుమిగూడటం తరచుగా వాటిని భయపెడుతోంది. వాహనాల మార్గాలు జంతువుల దారులను వెంబడించడంతో సహజ ప్రక్రియలకు అంతరాయం కలుగుతోంది.
మౌలిక సదుపాయాల నిర్వహణ సరిగా లేకపోవడంతో అభయారణ్యంలో కాలుష్యం పెరుగుతోంది. కీలకమైన వలస మార్గాల్లో విలాసవంతమైన హోటళ్లను నిర్మిస్తున్నారు. ఇవి నీటి వనరులను అడ్డుకుంటున్నాయి. కొత్తగా నిర్మించిన విలాసవంతమైన శిబిరాల్లో ఒకటి ‘గ్రేట్ మైగ్రేషన్’ మార్గానికి అడ్డుగా మారింది
. సింహాలు, దున్నలు, హిరోలా జింకలు, వైల్డ్బీస్ట్లతో సహా అనేక జాతుల జనాభా తీవ్రంగా పడిపోయింది. ప్రతి సీజన్లో ఆ ప్రాంతం గుండా ప్రయాణించే లక్షలాది వైల్డ్బీస్ట్లకు ఇది ఒక కీలకమైన ప్రదేశం. ఇటీవలి సంవత్సరాల్లో వాటి సంఖ్య 150,000 నుంచి కేవలం 15,000కి పడిపోయింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రిజర్వ్లోని సున్నితమైన ప్రాంతాలలో కొత్త పర్యాటక వసతులపై 2023లో నిషేధం విధించినప్పటికీ, కొత్త శిబిరాలు వెలుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఉన్న సౌకర్యాలు విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
న్యాయ పోరాటం
అభయారణ్యం లోపల, చుట్టుపక్కల పర్యాటక శిబిరాల నిర్మాణం, విస్తరణను సవాలు చేస్తూ పరిరక్షణ బృందాలు కోర్టుకెక్కాయి. ఈస్ట్ ఆఫ్రికా లా సొసైటీ, నేచురల్ జస్టిస్, జస్ట్యాక్ట్, ఆఫ్రికా సెంటర్ ఫర్ పీస్ అండ్ హ్యూమన్ రైట్స్ తాజాగా పిటిషన్ దాఖలు చేశాయి. కేసు విచారణ పూర్తయ్యే వరకు మసాయి మారా నేషనల్ రిజర్వ్లో నిర్మాణాలు, విస్తరణను నిలిపివేయాలని కోరుతున్నాయి. పలు బహుళ జాతి కంపెనీలు, ఇంటర్నేషనల్ లగ్జరీ హోటల్స్ నిర్మాణం, నిర్వహణను సవాలు చేశాయి. అభివృద్ధి పేరుతో విధ్వంసం కొనసాగితే మారా పర్యావరణ వ్యవస్థకు కోలుకోలేని నష్టం వాటిల్లవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


