15 పట్టణ నియోజకవర్గాల్లో 15 శాతానికి పైగా కనిపించని ఓటర్లు
ఇందులో శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లే అత్యధికం
అత్యధికంగా 31 శాతం ఓట్లు కోల్పోయిన తిరుపతి నియోజకవర్గం.. ‘సర్’ ముసాయిదా జాబితాలో వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వలసలు అత్యధికంగా ఉన్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ముసాయిదా జాబితా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 15 శాతానికి పైగా ఓటర్ల వివరాలు కనిపించని నియోజకవర్గాలు 15 ఉండగా... ఇవన్నీ పట్టణ నియోజకవర్గాలే కావడం గమనార్హం. అత్యధిక ఓటర్లు కనిపించని నియోజకవర్గాల్లో తిరుపతి మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఏకంగా 30.78 శాతం మంది ఓటర్ల వివరాలు తెలియరాలేదు.
తిరుపతి నియోజకవర్గంలో మొత్తం 2,95,288 మంది ఓటర్లు ఉండగా, వారిలో 90,882 మంది ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వలేదు. ఇందులో అత్యధికంగా 19.39 శాతం మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లినట్లు ముసాయిదా జాబితాలో పేర్కొన్నారు. తిరుపతి తర్వాత శాశ్వతంగా వలస వెళ్లిన వారిలో అత్యధికంగా గుంటూరు వెస్ట్, కర్నూలు, కాకినాడ సిటీ, కోవూరు, రాజమండ్రి సిటీ, గుంటూరు ఈస్ట్ వంటి నియోజకవర్గాలు ఉన్నాయి.
రాష్ట్రంలో సగటున 10.78 శాతం ఓటర్ల వివరాలు తెలియలేదు
రాష్ట్రవ్యాప్తంగా సగటున 10.78 శాతం మంది ఓటర్ల వివరాలు తెలియలేదు. అతి తక్కువ తెలియని ఓటర్ల శాతం ఉన్న నియోజకవర్గాల్లో 4.96 శాతంతో నరసాపురం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఉండి (4.96 శాతం), ఉంగుటూరు (5.02 శాతం), పి.గన్నవరం(5.23 శాతం), రాజానగరం(5.24 శాతం), భీమవరం (5.35 శాతం), ఆచంట (5.5 శాతం) వంటి నియోజకవర్గాలు ఉన్నాయి.


