
ద హేగ్: యుద్ధాల నేపథ్యంలో ‘నాటో’ సభ్యదేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రక్షణ బడ్జెట్లను పెంచుకోవాల్సిందేనన్న ట్రంప్ ఒత్తిడికి తలొగ్గాయి. 2035 నుంచి తమ జీడీపీలో 5 శాతాన్ని రక్షణ బడ్జెట్ కోసం కేటాయించేందుకు అంగీకరించాయి. నెదర్లాండ్స్లోని హేగ్ నగరం వేదికగా జరుగుతున్న నాటో సదస్సు బుధవారం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా 32 దేశాల అగ్రనేతలు పాల్గొన్నారు.
కూటమిలో ఏదైనా దేశంపై నాటోయేతర దేశం దాడికి దిగితే నాటో దేశాలన్నీ ఐక్యమై ఉమ్మడిగా దాడిచేయాలన్న తమ నిబద్దతను ‘ది హేగ్’ డిక్లరేషన్ పునరుద్ఘాటించింది. రక్షణ బడ్జెట్ను నాటో దేశాలు పెంచుకునేలా చేయడం అమెరికా సాధించిన ఘన విజయమని ట్రంప్ వ్యాఖ్యానించారు.
బడ్జెట్ను పెంచుకోవడం ద్వారా మా కూటమికి మరో ఒక ట్రిలియన్ డాలర్ల మేర ఆర్థికదన్ను దక్కుతుందని ట్రంప్ అన్నారు. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం తన తరం కాదని స్పెయిన్ ఇప్పటికే తెగేసి చెప్పింది. సదస్సుకు విచ్చేసిన సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ విడిగా సమావేశమయ్యారు. నాటో బడ్జెట్ పరోక్షంగా రష్యా దురాక్రమణకు అడ్డుకట్టవేసేందుకు అక్కరకొస్తుంది జెలెన్స్కీతో ట్రంప్ అన్నారు.