ఏసీల కోసం పొలిటికల్‌ ఫైట్‌.. ఎక్కడో తెలుసా? | A Nation at War Over Air Conditioning | Sakshi
Sakshi News home page

ఏసీల కోసం పొలిటికల్‌ ఫైట్‌.. ఎక్కడో తెలుసా?

Jun 26 2026 2:03 PM | Updated on Jun 26 2026 2:18 PM

A Nation at War Over Air Conditioning

ఒకప్పుడు పర్యావరణ పరిరక్షణ పేరుతో ఏసీలను వ్యతిరేకించిన దేశంలో.. ఇప్పుడు వాటిపైనే రాజకీయ యుద్ధం మొదలైంది. మండిపోతున్న ఎండలు, మూతపడుతున్న పాఠశాలలు, ఉక్కిరిబిక్కిరవుతున్న ఆస్పత్రులు, ప్రాణాపాయ స్థాయికి చేరుతున్న ఉష్ణోగ్రతలు.. చివరికి రాజకీయ పార్టీలను కూడా రెండు వర్గాలుగా విడగొట్టాయి. ఏసీలు అవసరమా? వద్దా? అన్న అంశమే ఇప్పుడు ఆ దేశ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఆ దేశమే ఫ్రాన్స్‌. గత కొన్ని రోజులుగా అక్కడ నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ వారం ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరువైన ఉష్ణోగ్రతలు నమోదవగా.. ఫ్రాన్స్‌ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదైన రోజు కూడా ఇదేనని అధికారులు వెల్లడించారు. వేడి తీవ్రతతో వేలాది పాఠశాలలు తాత్కాలికంగా మూతపడగా.. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, రోగులు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పోర్టబుల్‌ ఏసీల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పిల్లలు కొంతసేపైనా తరగతి గదుల్లో ఉండేందుకు, అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రజలు రాత్రిపూట నిద్రపోయేందుకు ఏసీలే మార్గమవుతున్నాయి. అయితే ఇక్కడే రాజకీయ చర్చ మొదలైంది. 

ప్రతిపక్షం మాత్రం ఈ వేడి పరిస్థితులను ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. కుడిపక్ష (రైట్‌ వింగ్‌) నాయకురాలు మరీన్‌ లె పెన్‌.. దేశంలోని అన్ని పాఠశాలలు, ఆస్పత్రుల్లో తక్షణమే ఏసీలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు.. కోట్లాది కుటుంబాలు తమ ఇళ్లలో ఏసీలు అమర్చుకునేందుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రజల ప్రాణాల కంటే పర్యావరణ సిద్ధాంతాలు ముఖ్యమా? అంటూ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు.

అదే సమయంలో పర్యావరణవాదులు, గ్రీన్‌ పార్టీ తమ పాత వైఖరిని కొంత సవరించుకున్నాయి. ఇప్పటివరకు ఏసీలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆ పార్టీ.. ప్రస్తుత తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో కనీసం పాఠశాలలు, ఆస్పత్రుల్లో మాత్రం శీతలీకరణ సదుపాయాలు తప్పనిసరి అని అంగీకరించింది. అయితే దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా ఏసీల వినియోగాన్ని ప్రోత్సహించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తోంది. అధిక విద్యుత్‌ వినియోగం, గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల, నగరాల్లో వేడి మరింత పెరగడం వంటి పర్యావరణ సమస్యలను గుర్తు చేస్తూ జాగ్రత్తలు అవసరమని చెబుతోంది.

మరోవైపు అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ ప్రభుత్వం సమతుల్య వైఖరిని అవలంబిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అవసరమైన చోట ఏసీల వినియోగాన్ని సమర్థిస్తూనే.. దేశమంతా ఏసీలను విస్తృతంగా ప్రోత్సహించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. భవనాల్లో మెరుగైన ఇన్సులేషన్‌, సహజ గాలి ప్రసరణ, పచ్చదనం పెంపు వంటి శాశ్వత పరిష్కారాలకే ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్పత్రులు, పాఠశాలలు వంటి కీలక ప్రాంతాల్లో శీతలీకరణ సదుపాయాలు అనివార్యమనే విషయాన్ని కూడా అంగీకరిస్తోంది.

ప్రస్తుతం ఫ్రాన్స్‌లో కేవలం 25 శాతం ఇళ్లలో మాత్రమే ఏసీలు ఉన్నాయి. అదే స్పెయిన్‌, ఇటలీల్లో ఈ సంఖ్య 50 శాతం కాగా.. అమెరికా, జపాన్‌లలో దాదాపు 90 శాతం ఇళ్లలో ఏసీలు ఉన్నాయి. దీంతో పెరుగుతున్న వేడి పరిస్థితుల్లో ఫ్రాన్స్‌ కూడా తన పాత విధానాన్ని మార్చక తప్పదనే అభిప్రాయం బలపడుతోంది.

మొత్తానికి.. ఒకప్పుడు పర్యావరణ పరిరక్షణ పేరుతో ఏసీలను దూరంగా ఉంచిన ఫ్రాన్స్‌.. ఇప్పుడు అదే ఏసీల అవసరంపై రాజకీయంగా, సామాజికంగా కొత్త చర్చను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పుల తీవ్రత పెరుగుతున్న కొద్దీ.. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలా? లేక ప్రజల ప్రాణాలను కాపాడేందుకు శీతలీకరణ సదుపాయాలను విస్తరించాలా? అనే ప్రశ్న ఇప్పుడు ఫ్రాన్స్‌ రాజకీయాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement