source: X
ఇండోనేషియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత పాఠశాల భోజన పథకంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ పథకంలో భోజనం తిని మూడు రోజుల వ్యవధిలో 1700 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అస్వస్థతకు గురయ్యారు. ఇందుకు గల కారణం ఫుడ్ పాయిజనింగ్ అని తెలుస్తుంది.
తాజాగా సెంట్రల్ జావా ప్రావిన్స్లోని లాసెమ్ ప్రాంతంలో ప్రభుత్వ ఉచిత భోజనం తిన్న 777 మంది ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యారు. వీరిలో 752 మంది విద్యార్థులు, 25 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. బుధవారం అందించిన భోజనం తర్వాత పలువురికి వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి.
వరుస కేసులు
ఇటీవలికాలంలో ఇండోనేషియాలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. మంగళవారం తూర్పు జావాలోని సిడోఆర్జోలో 664 మంది విద్యార్థులు, న్గాంజుక్లో 49 మంది, పశ్చిమ సుమత్రాలోని అగామ్ ప్రాంతంలో 237 మంది ఫుడ్ పాయిజనింగ్కు గురైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా సెప్టెంబర్ 1 నాటికి 50 వేల మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.
భారీ వ్యయంతో అమలు చేస్తున్న పథకం
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో గత ఏడాది కోట్లాది డాలర్ల వ్యయంతో ఈ ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పిల్లలకు మెరుగైన పోషకాహారం అందించాలన్నది ఈ పథకం ప్రధాన లక్ష్యం.
అయితే పథకం ప్రారంభమైనప్పటి నుంచి అవినీతి ఆరోపణలు, నిర్వహణలో మార్పులు, ఆహార నాణ్యతపై విమర్శలు, వరుసగా నమోదవుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. ఆహారాన్ని సరిగా నిల్వ చేయకపోవడం, వండిన భోజనాన్ని ఆలస్యంగా పంపిణీ చేయడం వంటి కారణాలు ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
చదవండి: పాకిస్తానీ వ్యక్తికి రూ.35 కోట్ల జాక్పాట్.. భారతీయుడికి ల్యాండ్ రోవర్


