ఇరాన్ తమ ఆంక్షల నుంచి తప్పించుకునే అవకాశమే లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అంటున్నారు. ఆ దేశానికి ఆదాయం సమకూర్చేలా ఎలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడంలోనూ ఇతర దేశాలు సహకరించకూడదని స్పష్టం చేశారు. అలా చేస్తే ఆయా దేశాలపైనా అమెరికా ఆంక్షలు విధించాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో బిష్కెక్లో భేటీ అయిన తరుణంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇరాన్తో సంబంధాలు కొనసాగించే హక్కు ప్రతి దేశానికీ ఉందని రూబియో పేర్కొన్నారు. అమెరికా కూడా గతంలో ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపిందని గుర్తుచేశారు. అయితే ఆర్థికంగా ఇరాన్కు సహకరించడం, అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు మార్గాలు సృష్టించడం మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇరాన్ ఆంక్షలను తప్పించుకుని ఆదాయం సంపాదించేలా ఏ దేశమైనా సహకరిస్తే.. ఆ దేశంపైనా అమెరికా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇరాన్ సంపాదించే ఆదాయాన్ని ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడానికి, అణ్వాయుధాల తయారీకి ఉపయోగించే అవకాశం ఉందని రూబియో ఆరోపించారు.
భారత్–ఇరాన్ వాణిజ్యంపై కామెంట్..
మోదీ–పెజెష్కియాన్ భేటీపై స్పందించిన మార్కో రూబియో.. భారత్, ఇరాన్ మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం గురించి తనకు తెలియదని అన్నారు. ఇరాన్తో సంబంధాలు పెట్టుకోవడం ఆయా దేశాల విదేశాంగ విధానానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. అయితే అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు ఇరాన్కు సహకరించడం వేరు అని స్పష్టం చేశారు. వాణిజ్య సంబంధాల ద్వారా ఇరాన్కు నిధులు సమకూరేలా చేసి.. వాటిని అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే పరిస్థితిని తాము అంగీకరించబోమని రూబియో వ్యాఖ్యల సారాంశం.
మోదీ–పెజెష్కియాన్ భేటీలో..
షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సమావేశమయ్యారు. భారత్–ఇరాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అదే సమయంలో పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రాంతీయ పరిస్థితులపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. శాశ్వత శాంతి కోసం జరిగే ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగిస్తుందని మోదీ స్పష్టం చేశారు.
వాణిజ్య నౌకల భద్రతపై భారత్ ఆందోళన
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం సముద్ర రవాణాపైనా పడుతున్న నేపథ్యంలో.. వాణిజ్య నౌకలు, నావికుల భద్రత అంశం కూడా ఇరువురు నేతల చర్చల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. వాణిజ్య నౌకాయానం, స్వేచ్ఛాయుత రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని భారత్ స్పష్టం చేసింది. పౌరులు, పౌర మౌలిక వసతులు, వాణిజ్య నౌకలు, నావికులను దాడుల పరిధిలోకి తీసుకురావొద్దని న్యూఢిల్లీ తన వైఖరిని పునరుద్ఘాటించింది.
దౌత్యపరమైన పాత్రకు పిలుపు
మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ తన దౌత్య సంబంధాలను ఉపయోగించాలని కోరారు. సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్నది తమ ప్రభుత్వ విధానమని చెప్పారు.
అమెరికా మాత్రం దౌత్య మార్గాన్ని పక్కనపెట్టి బలప్రయోగం, యుద్ధం, ఆంక్షల బాట పట్టిందని ఆయన విమర్శించారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ప్రజల రక్షణతో పాటు శాంతి, స్థిరత్వానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచుతున్న అమెరికా
ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలు, సంస్థలు అమెరికా ఆంక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రూబియో తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్తో సంబంధాలు కొనసాగించడాన్ని పూర్తిగా నిషేధించడం లేదని చెబుతూనే.. ఆంక్షలను తప్పించుకునేలా ఆర్థిక సహకారం అందించే దేశాలను మాత్రం అమెరికా ఉపేక్షించబోదన్న సంకేతాన్ని వాషింగ్టన్ ఇచ్చింది.
భారత్కు సవాల్
ఇరాన్తో భారత్కు దీర్ఘకాలిక చారిత్రక, వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. మరోవైపు అమెరికాతోనూ భారత్ కీలక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. దీంతో ఇరాన్తో వాణిజ్య సంబంధాలను విస్తరించడంతో పాటు అమెరికా ఆంక్షలను ఉల్లంఘించకుండా ఉండటం న్యూఢిల్లీకి కీలకంగా మారింది.
మోదీ–పెజెష్కియాన్ భేటీ తర్వాత రూబియో చేసిన తాజా హెచ్చరిక.. ఇరాన్ విషయంలో భారత్ సహా ఇతర దేశాలపై అమెరికా నిఘా, ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందన్న సంకేతంగా కనిపిస్తోంది.
ఇదీ చదవండి: గూగుల్ తర్వాత యాపిల్ అదే పని చేసిందిగా!


