source: X
ఇరాన్పై తమ లక్ష్యం ఇంకా పూర్తికాలేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్లోని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఇందుకోసం ఇజ్రాయెల్లోని అన్ని వ్యవస్థలు కలిసి పనిచేస్తున్నాయి స్పష్టం చేశారు.
తాజాగా అమెరికా ఇరాన్పై దాడులు ప్రారంభించిన నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇజ్రాయెల్ మునుపటిలా అమెరికాతో కలిస్తే ఇరాన్కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నెతన్యాహు వ్యాఖ్యలను బట్టి చూస్తే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
కాగా, ఇరాన్పై యుద్దాన్ని తొలుత ఇజ్రాయెలే ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఇరాన్పై భారీ సైనిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీయడం, ఇరాన్ పాలక వ్యవస్థపై ఒత్తిడి పెంచడం ప్రధాన లక్ష్యాలుగా Operation Epic Fury (అమెరికా), Operation Roaring Lion (ఇజ్రాయెల్) జరిగాయి.
ఈ ఆపరేషన్స్లో ఇరాన్ తమ సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోగా.. ఇరాన్ ప్రతిదాడుల్లో అమెరికా, ఇజ్రాయెల్కు కూడా నష్టం సంభవించింది.
శాంతి చర్చల పేరుతో ఈ యుద్దానికి పాక్షికంగా బ్రేక్ పడినప్పటికీ.. నిన్నటి నుంచి మళ్లీ మొదలైంది. ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై అమెరికా తొలుత దాడులు చేయగా.. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది.
చదవండి: ‘ట్రంపిజం’ ప్రపంచాన్ని ఎలా మారుస్తోంది? మనపై ప్రభావం ఇలా..


