దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.5గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7:30 సమయంలో శక్తివంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలను అధికారులు సూచించారు.
భూకంప కేంద్రం మిండనావో ద్వీపంలోని జోస్ అబాద్ సాంటోస్ పట్టణానికి నైరుతి దిశలో సుమారు 35 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 52.4 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యూఎస్జీఎస్ తెలిపింది. తొలుత దీని తీవ్రతను 6.7గా అంచనా వేసిన అధికారులు.. అనంతరం 6.5గా సవరించారు. ఈ భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదని స్థానిక సహాయ బృందాల అధికారులు తెలిపారు.
సాంటా మారియా పట్టణానికి చెందిన రెస్క్యూ అధికారి జెర్సన్ తలాహిగ్ మాట్లాడుతూ.. భూకంపం బలంగానే సంభవించిందని.. అయితే అది కొద్ది సెకన్లపాటే కొనసాగింది. టేబుళ్లు, లైట్లు స్వల్పంగా ఊగడం కనిపించిందని చెప్పారు. కాగా, ఇదే ప్రాంతంలో ఈ నెల జూన్ 8న 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ భూకంపం వల్ల భవనాలు కూలిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.


