కిమ్ వంశంలో బిగ్‌ మిస్టరీ.. రాజమాత వెనుక దాగిన నిజమేంటి? | Kim Jong Un never talks about his mother Ko Yong hui; Full Details Here | Sakshi
Sakshi News home page

కిమ్ వంశంలో బిగ్‌ మిస్టరీ.. రాజమాత వెనుక దాగిన నిజమేంటి?

Jun 28 2026 9:52 AM | Updated on Jun 28 2026 10:25 AM

Kim Jong Un never talks about his mother Ko Yong hui; Full Details Here

ప్రపంచంలో అత్యంత రహస్య రాజకీయ వ్యవస్థగా భావించే ఉత్తర కొరియాలో పాలన మొత్తం ఒకే వంశం చుట్టూ తిరుగుతుంది. ఆ వంశమే కిమ్‌ ఇల్‌ సంగ్‌ స్థాపించిన “కిమ్ డైనాస్టీ”. ఆయన తరువాత దేశాన్ని నడిపింది ఆయన కుమారుడు కిమ్‌ జోంగ్‌ ఇల్‌, ఇప్పుడు పాలన కొనసాగిస్తున్నది ఆయన మనవడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.

ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వెనుక ఉన్న కుటుంబ కథలో అత్యంత రహస్యంగా మిగిలిన పేరు ఆయన తల్లి కో జోంగ్‌ హుయి. ఒక దేశాన్ని పాలించే “కిమ్ వంశం”లో భాగమైనా, ఆమె ఎందుకు ప్రపంచానికి దూరంగా ఉండిపోయిందన్నది. ఆమె జీవితం ఎందుకు రాజకీయ మిస్టరీగా మిగిలిపోయింది. ఆమెకు జపాన్‌కు ఏంటి సంబంధం?. ఆమెకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో కొత్తగా చర్చనీయాంశంగా మారాయి.

ఉత్తర కొరియా నేత కిమ్‌ వ్యక్తిగత జీవితంలో ప్రపంచ రాజకీయ వేదికల్లో ఆయన తండ్రి, తాతల గురించి తరచూ ప్రస్తావన వస్తున్నా, తల్లి పేరు మాత్రం చాలా అరుదుగా మాత్రమే వినిపిస్తుంది. అత్యంత తక్కువగా చర్చించబడే వ్యక్తుల్లో ఒకరు ఆయన తల్లి కో జోంగ్‌ హుయి ఒకరు. దీనికి కారణం వ్యక్తిగతం కంటే ఎక్కువగా “రాజకీయ కథనం” అని విశ్లేషకులు చెబుతున్నారు. కిమ్ జోంగ్ ఉన్ అధికారంలో ఉన్న ఉత్తర కొరియాలో నాయకత్వాన్ని పవిత్ర వంశంగా చూపించే సిద్ధాంతం బలంగా అమలులో ఉంది. ఈ వంశాన్ని ‘పెక్టు పర్వత రక్తవంశం’గా అభివర్ణిస్తూ దేశ స్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌, కిమ్‌ జోంగ్‌ ఇల్‌ పేర్ల చుట్టూ అధికారం కొనసాగుతోంది. అక్కడ నాయకత్వం ఒక రాజకీయ పదవి మాత్రమే కాదు. అది ఒక పవిత్ర వారసత్వంగా చూపించబడుతుంది.

ఈ నేపథ్యంలో కిమ్‌ తల్లి కో జోంగ్‌ హుయి పాత్ర మాత్రం చాలా పరిమితంగా చూపించబడింది. కో జోంగ్‌ హుయి జపాన్‌లో జన్మించిన కొరియన్ కుటుంబానికి చెందిన మహిళ. ఆమె జపాన్‌కు చెందినవారు కావడం, అలాగే కళారంగంలో నృత్య కళాకారిణిగా పని చేయడం వంటి అంశాలు ఉత్తర కొరియా అధికారిక ప్రచారానికి అనుకూలంగా ఉండవు. అయితే, ఉత్తర కొరియా పాలనలో నాయకుడి కుటుంబం వ్యక్తిగత వ్యక్తులుగా కాకుండా ప్రతీకాత్మక వంశ చిహ్నాలుగా మాత్రమే చూపబడతారు. ఈ కారణంగా, తల్లి నేపథ్యం రాజవంశానికి అంతగా సరిపోకపోవడంతో ఆమెను ప్రజా ప్రచారంలో చాలా తక్కువగా చూపిస్తున్నారు. అంతేకాకుండా, రాష్ట్ర మీడియా మరియు అధికారిక ప్రచార యంత్రాంగం నాయకుడి ఇమేజ్‌ను బలపరచడానికే దృష్టి పెడుతుంది. అందువల్ల తండ్రి, తాతల పాత్రలు ప్రధానంగా చూపించబడుతూ తల్లి పాత్ర మాత్రం రహస్యంగా ఉంచారని తెలుస్తోంది.

ఉత్తర కొరియాలో ప్రతీ అంశం రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే ప్రజలకు చూపించబడుతుంది. కిమ్ జోంగ్ ఉన్ తల్లి గురించి మౌనం పాటించడం ఒక వ్యక్తిగత నిర్ణయం కాకుండా, ఉత్తర కొరియా రాజకీయ వ్యవస్థలోని ప్రచార నిర్మాణం మరియు “పెక్టు వంశం” సిద్ధాంతాన్ని కాపాడే వ్యూహం అని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.

కిమ్ వంశం మూడు తరాలు..
ప్రపంచంలో అత్యంత కఠిన నియంత్రణ కలిగిన దేశంగా భావించే ఉత్తర కొరియాలో అధికారానికి కేంద్రంగా ఉన్నది “కిమ్ వంశం”. ఇది సాధారణ రాజకీయ పార్టీ నాయకత్వం కాకుండా, మూడు తరాలుగా కొనసాగుతున్న ఒకే కుటుంబ పాలనగా గుర్తింపు పొందింది.

మొదటి తరం: స్థాపకుడు
ఉత్తర కొరియా ఆధునిక రాజకీయ వ్యవస్థను నిర్మించిన వ్యక్తి కిమ్‌ ఇల్‌ సంగ్‌. 
ఆయన నాయకత్వంలో దేశ స్థాపన జరిగింది
కమ్యూనిస్టు పాలన బలపడింది
“పెక్టు పర్వత పవిత్ర వంశం” అనే భావన ప్రారంభమైంది
ఈ భావన తర్వాత మొత్తం వంశ రాజకీయానికి ఆధారంగా మారింది.

రెండో తరం: వారసత్వ పాలన
ఆయన కుమారుడు కిమ్‌ జోంగ్‌ ఇల్‌ దేశాన్ని తరువాత దశాబ్దాల పాటు పాలించాడు.
ఆయన కాలంలో నాయకత్వాన్ని మరింత కేంద్రీకరించారు
సైనిక ప్రాధాన్యత పెరిగింది (Songun పాలసీ)
వంశాన్ని “దైవసమాన నాయకత్వం”గా చూపించే ప్రచారం పెరిగింది

మూడో తరం: ప్రస్తుత పాలన
ప్రస్తుతం దేశాన్ని నడుపుతున్నది ఆయన కుమారుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.
ఆయన కాలంలో అణ్వస్త్ర కార్యక్రమం వేగం పెరిగింది
అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి
కుటుంబ వంశం ఇమేజ్‌ను ఇంకా బలంగా ప్రచారం చేస్తున్నారు.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement