అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇరాన్లో నాయకత్వ మార్పుదిశగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఖమేనీ పరిస్థితిపై స్పష్టత లేదు. ఆయన రహస్య ప్రదేశానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ రైట్ హ్యాండ్ జనరల్ అలీ ఖంబాని హతం కాగా, ఇరాన్కు చెందిన పలువురు సినియర్ కమాండర్లు మృతిచెందినట్లు సమాచారం.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు, దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతొల్లా ఆలీ ఖమేని చనిపోయాడంటూ ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తుండగా.. తమ సుప్రీం లీడర్ సురక్షితంగా ఉన్నారని ఇరాన్ ఆర్థిక మంత్రి అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని కూడా వెనిజెవెలా అధ్యక్షుడు మదురో మాదిరిగా పట్టుకునేందుకు ఇజ్రాయెల్తో కలిసి అమెరికా జల్లెడ పడుతోంది. 1979లో రిపబ్లిక్గా మారినప్పటి నుంచి ఇరాన్లో ఎన్నడూ లేని విధంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం.. దాన్ని అణచివేసేందుకు ఖమేనీ నేతృత్వంలోని ఐఆర్జీసీ బలగాల దమనకాండ.. వేల మంది మరణాల నేపథ్యంలో.. ట్రంప్ టెహ్రాన్పై దాడికి దిగారు. ప్రస్తుత పరిణామాలు, జియోపాలిటిక్స్ ఈక్వేషన్లు అంచనా వేసినట్లుగానే జరుగుతున్నాయి.
మదురోను అరెస్టు చేసిన సమయంలో అమెరికా తన నౌకదళాన్ని ఎక్కువగా వాడుకుంది. అదే సమయంలో సైబర్ ఎటాక్లు చేసింది. ఇప్పుడు కూడా అమెరికాకు చెందిన యుద్ధ విమానాల వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ జలాల సమీపంలోకి రావడంతో.. ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది.
ఇరాన్ పౌరులు కూడా ఖమేనీ శకాన్ని ఖతం చేయాలంటూ భీష్మించుకోవడం.. లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుండడం ఇప్పుడు అమెరికాకు కలిసివచ్చింది. నిజానికి 2012లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనేజాద్ తాము యురేనియం కడ్డీని తయారు చేశామని ప్రకటించినప్పటి నుంచే అమెరికా గుర్రుగా ఉంది. ఇప్పుడు టెహ్రాన్లో ప్రజాందోళనలు అమెరికాకు కలిసివచ్చాయి. ఇదే అదనుగా ఇజ్రాయెల్తో కలిసి అమెరికా యుద్ధం ప్రారంభించిందనే వాదనలు ఉన్నాయి.
వాస్తవానికి ఇరాన్-అమెరికా వివాదాలు, దాడులు-ప్రతిదాడులు గత ఏడాది నుంచి మొదలయ్యాయి. గత ఏడాది జూన్ 21 అర్ధరాత్రి దాటాక ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఆ మర్నాడే ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. ఖతార్లోని అమెరికా ఎయిర్ బేస్లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే.. ఆ దాడి గురించి ఇరాన్ తమకు ముందుగానే సమాచారం అందించిందని అప్పట్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాహాటంగా చెప్పారు. ఫలితంగా తాము ఇరాన్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొన్నట్లు వివరించారు. 2020లో ట్రంప్ ఇదే తరహా దాడులు చేయించారు.
ఆ ఏడాది జనవరి 3న ఇరాక్లోని బగ్దాద్ విమానాశ్రయం సమీపంలో.. కుద్స్ఫోర్స్ కమాండర్ ఖాసీం సులేమానీ లక్ష్యంగా దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణులతో ఇరాక్లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న అల్-అసద్ వైమానిక స్థావరంపై విరుచుకుపడింది. అప్పట్లో కూడా ఇరాన్ ముందస్తుగా సమాచారం ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఈ దాడులతో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగకున్నా.. అప్పట్లో అక్కడ పనిచేసిన సైనికులు ఇప్పుడు అదే ట్రామాలో కొనసాగుతూ మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారనే నివేదికలు వచ్చాయి.
గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇప్పుడు దాడులు-ప్రతిదాడుల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టమవుతోంది. అమెరికా సైనిక శక్తి విషయంలో బలంగా ఉంది. ఇరాన్ ఆ విషయంలో చాలా వెనుకబాటులో ఉంది. అయితే.. బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాలను సమకూర్చుకోవడంలో ఇరాన్ గడిచిన మూడేళ్లలో చాలా పురోగతి సాధించింది. అయితే.. సొంత ప్రజలే వ్యతిరేకంగా ఉండడంతో.. ఇరాన్ సర్కారు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని, కొన్ని ప్రాంతాలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందంటూ ఇటీవల నివేదికలు వచ్చాయి. ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు నేపథ్యంలో ఖమేనీ ఇప్పటికీ టెహ్రాన్లోనే ఉన్నాడా? లేక వేరే దేశంలో తలదాచుకుంటున్నాడా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.


