పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయన్న సంకేతాల మధ్య లెబనాన్పై ఇజ్రాయెల్ మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడింది. దక్షిణ లెబనాన్లో మంగళవారం జరిగిన వరుస డ్రోన్ దాడుల్లో కనీసం నలుగురు మరణించగా, పలువురు గాయపడినట్లు లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ (NNA) వెల్లడించింది.
మయ్ఫదౌన్ గ్రామంలో ఓ కారును లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. పేలుడు జరిగిన తర్వాత ఘటనాస్థలికి చేరుకున్న వారిపై మరోసారి డ్రోన్ దాడి జరగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీనిని "డబుల్ ట్యాప్ స్ట్రైక్"గా అధికారులు పేర్కొన్నారు. మరోవైపు షౌకిన్ పట్టణంలో జరిగిన డ్రోన్ దాడిలో మరో ఇద్దరు మరణించారు.
అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి అవగాహన కుదిరిన నేపథ్యంలో ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య పోరాటం కొంత తగ్గినప్పటికీ పూర్తిగా ఆగలేదని తాజా ఘటనలు సూచిస్తున్నాయి. మంగళవారం మొత్తం దక్షిణ లెబనాన్లో డ్రోన్ దాడులు, క్షిపణి ప్రయోగాలు, ఫిరంగి కాల్పులు కొనసాగినట్లు ఎన్ఎన్ఏ తెలిపింది. అదే సమయంలో రాజధాని బీరూట్పై కూడా ఇజ్రాయెల్ నిఘా డ్రోన్లు చక్కర్లు కొట్టాయి.
ఈ ఏడాది మార్చి 2 నుంచి ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్పై దాడులు చేస్తుంది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యల్లో ఇప్పటివరకు 3,820 మందికిపైగా మరణించారు. సుమారు 12 లక్షల మంది నిరాశ్రయులయ్యారని లెబనాన్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘర్షణల్లో కనీసం 28 మంది ఇజ్రాయెల్ సైనికులు, నలుగురు పౌరులు మరణించినట్లు సమాచారం.


