గాజా స్కూల్‌పై ఇజ్రాయెల్‌ దాడి | Israeli airstrike on school building kills 17 in Gaza | Sakshi
Sakshi News home page

గాజా స్కూల్‌పై ఇజ్రాయెల్‌ దాడి

Oct 25 2024 6:03 AM | Updated on Oct 25 2024 6:03 AM

Israeli airstrike on school building kills 17 in Gaza

17 మంది పాలస్తీనియన్లు మృతి 

డెయిర్‌ అల్‌–బలాహ్‌: గాజాలోని నుసెయిరత్‌ శరణార్థి శిబిరంలోని స్కూల్‌ భవనంపై గురువారం ఇజ్రాయెల్‌ ఆర్మీ జరిపిన దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది చిన్నారులు, 18 ఏళ్ల మహిళలున్నారని పాలస్తీనా వైద్య విభాగం తెలిపింది. ఘటనలో గాయపడిన మరో 42 మంది దగ్గర్లోని ఔదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిపై ఇజ్రాయెల్‌ ఆర్మీ స్పందించలేదు. హమాస్‌ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ఆర్మీ తరచూ శరణార్థులు తలదాచుకుంటున్న స్కూల్‌ భవనాలపై దాడులకు దిగుతోంది.

 ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది అక్టోబర్‌ 7వ తేదీన గాజాలోని హమాస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ఆర్మీ దాడులు మొదలుపెట్టింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 42 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు మృతి చెందారు. క్షతగాత్రులు లక్ష వరకు ఉంటారని అంచనా. తాము 17 వేల మంది హమాస్‌ మిలిటెంట్లను చంపేశామంటున్న ఇజ్రాయెల్‌ ఆర్మీ సంబంధిత ఆధారాలను మాత్రం వెల్లడించడం లేదు. హమాస్, ఇజ్రాయెల్‌ ఆర్మీ మధ్య యుద్ధం కారణంగా గాజాలోని 23 లక్షల మందిలో 90 శాతం మంది నిరాశ్రయులయ్యారు. 

ఆస్పత్రుల్లో మందుల కొరత 
ఉత్తర గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ ఆర్మీ తరచూ చేస్తున్న దాడులతో నివాసాలు నేలమట్టమవుతున్నా యి. వందల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాదిగా నిరాశ్రయులవుతున్నారు. మళ్లీ బలం పుంజుకుంటున్న హమాస్‌ సాయుధులే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ అంటోంది. అయితే, ఈ దాడుల్లో గాయపడిన ఇంటెన్సివ్‌ కేర్‌లోని 14 మంది చిన్నారులు సహా సుమారు 150 మంది తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఉత్తర గాజాలోని కమాల్‌ అద్వాన్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ హొసమ్‌ అబూ సయేఫ్‌ తెలిపారు. వైద్య సిబ్బంది, మందుల కొరత కారణంగా గంటకొకరు చొప్పు న తుది శ్వాస విడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆయన విడుదల చేశారు.

ముగ్గురు లెబనాన్‌ సైనికులు మృతి 
బీరుట్‌: ఇజ్రాయెల్‌ ఆర్మీ గురువారం జరిపిన దాడిలో లెబనాన్‌ ఆరీ్మకి చెందిన ముగ్గురు చనిపోయారు. యటెర్‌ పట్టణంలో క్షతగాత్రులను తరలిస్తున్న ఒక ఆర్మీ అధికారి, ఇద్దరు సిబ్బంది చనిపోయినట్లు ఆ దేశ ఆర్మీ ‘ఎక్స్‌’లో తెలిపింది. సెప్టెంబర్‌లో హెజ్‌»ొల్లా, ఇజ్రాయెల్‌ ఆర్మీ మధ్య భీకర పోరు మొదలయ్యాక యటెర్‌పై దాడి జరగడం ఇది ఎనిమిదోసారని పేర్కొంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement