
ఇజ్రాయెల్ దాడుల్లో మరో 95 మంది మృతి
టెల్ అవీవ్: గాజాలో థాయ్లాండ్ బందీ నాతాపాంగ్ పింటా మృతదేహాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ప్రకటించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై హఠాత్తుగా దాడికి దిగి 1,200 మందిని హత్య చేయడంతోపాటు 251 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. బందీల్లో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. థాయ్లాండ్ పౌరుడు నాతాపాంగ్ పింటా కూడా అప్పట్లో హమాస్ చెరలో చిక్కుకున్నాడు. అతడిని వినిపించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
కాల్పుల విరమణ ఒప్పందంతో కొందరు బందీలు విడుదలైనప్పటికీ పింటాకు విముక్తి లభించలేదు. తాజాగా అతడి మృతదేహం లభించడం విషాదాన్ని నింపింది. వ్యవసాయ పనుల కోసం థాయ్లాండ్ నుంచి ఇజ్రాయెల్కు వచ్చిన పింటా చివరకు దురదృష్టకరమైన రీతిలో మరణించాడు. హమాస్ మిలిటెంట్లే అతడిని హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గత 24 గంటల్లో కనీసం 95 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 54,000 మందికిపైగా మృతిచెందడం గమనార్హం