
పెద్ద సంఖ్యలో అణు బాంబులు, న్యూక్లియర్ వార్హెడ్లు
1958 నుంచే అణు పరీక్షలు చేస్తున్న యూదు దేశం
టెల్ అవీవ్: ఇరాన్ అణు కేంద్రాలను సర్వనాశనం చేయడం తథ్యమని ఇజ్రాయెల్ పదేపదే చెబుతోంది. భవిష్యత్తులో తమ మనుగడకు ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే అణు బాంబు తయారు చేయకుండా ఇరాన్ను అడ్డుకోవడం ఒక్కటే మార్గమని అంటోంది. ఇజ్రాయెల్ విజ్ఞప్తి మేరు ఇరాన్లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. మరోవైపు తన వద్దనున్న అణ్వస్త్రాల గురించి ఇజ్రాయెల్ నోరువిప్పడం లేదు.
పశ్చిమాసియాలో అణుబాంబులు కలిగి ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్ అన్న సంగతి బహిరంగ రహస్యమే. కానీ, దానిపై యూదు పాలకులు మాట్లాడడం గానీ, ఖండించడం గానీ చేయరు. అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ ఒప్పందం(ఎన్పీటీ)లో భాగస్వామి కాని ఐదు దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఉంది. దాంతో అణ్వాయుధాలు వదులుకోవాలంటూ ప్రపంచ దేశాలు ఒత్తిడి చేయలేకపోతున్నాయి.
ఇజ్రాయెల్ అణుకేంద్రాలను అంతర్జాతీయ నిపుణులు తనిఖీ చేసే అవకాశం కూడా లేదు. ఇరాన్ అణు కార్యక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తున్న పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్ను మాత్రం స్వేచ్ఛగా వదిలేయడం పట్ల అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం సొంత భద్రత కోసం, శాంతియుత ప్రయోజనాల కోసమే అణు పరీక్షలు చేస్తున్నామని ఇరాన్ చెబుతున్నా పశ్చిమ దేశాలు ఒప్పుకోవడం లేదు. అణ్వస్త్రాలు కలిగిన ఇజ్రాయెల్ను ముద్దు చేస్తున్నాయి.
1,110 కిలోల ప్లుటోనియం నిల్వలు
ఇజ్రాయెల్ అణు చరిత్ర ఈనాటిది కాదు. 1950వ దశకంలోనే అణ్వాయుధాలపై దృష్టి పెట్టింది. డిమోనా సిటీలో 1958లో నెగెవ్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించింది. చుట్టూ శత్రుదేశాలే ఉండడంతో రక్షణ అణుబాంబులు అవసరమని అప్పటి ప్రధానమంత్రి డేవిడ్ బెన్ గురియన్ నిర్ణయించారు. ప్లుటోనియం ఉత్పత్తి జరుగుతున్న నెగెవ్ సెంటర్ గురించి ప్రపంచానికి తెలియనివ్వలేదు.
అదొక వ్రస్తాల ఫ్యాక్టరీ అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. 1970 నాటికి అణు వార్హెడ్లను ప్రయోగించే స్థాయికి ఇజ్రాయెల్ చేరుకుంది. నెగెవ్ సెంటర్లో జరుగుతున్న అణు కార్యకలాపాల సంగతి 1986లో బయటపడింది. అక్కడే పని చేస్తున్న ఓ టెక్నీషియన్ ఈ విషయం బహిర్గతం చేశారు. దాంతో దేశద్రోహం ఆరోపణల కింద ప్రభుత్వం అతడిని 18 ఏళ్లపాటు జైల్లో నిర్బంధించింది. ఇజ్రాయెల్ క్రమంగా అణుశక్తి సంపన్న దేశంగా మారింది.
దాదాపు 200 న్యూక్లియర్ వార్హెడ్లు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే 1,110 కిలోల(2,425 పౌండ్లు) ప్లుటోనియం ఇజ్రాయెల్ వద్ద నిల్వ ఉంది. దీంతో 277 అణు బాంబులు తయారు చేయొచ్చు. న్యూక్లియర్ క్రూయిజ్ క్షిపణులను, అణు వార్హెడ్లలను ప్రయోగించే ఆరు జలాంతర్గాములతోపాటు బాలిస్టిక్ మిస్సైళ్లు ఇజ్రాయెల్ వద్ద ఉన్నట్లు సమాచారం. 6,500 కిలోమీటర్ల పరిధి వరకు అణుబాంబులను ఇజ్రాయెల్ ప్రయోగించగలదు. ఇజ్రాయెల్ అణ్వ్రస్తాల ముప్పును ఎదుర్కొంటున్న ప్రధాన దేశం ఇరాన్.