ఖమేనీ కథ ముగిస్తాం.. ఇజ్రాయెల్‌ సంచలన ప్రకటన | Israel Direct Warn To Iran Supreme Leader Ali Khamenei, Says He Can No Longer Be Allowed To Exist | Sakshi
Sakshi News home page

Israel-Iran Conflict: ఖమేనీ కథ ముగిస్తాం.. ఇజ్రాయెల్‌ సంచలన ప్రకటన

Jun 19 2025 4:21 PM | Updated on Jun 19 2025 4:34 PM

Israel Direct Warn To Iran Supreme Ali Khamenei

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్‌ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ కథ ముగిస్తామని ప్రకటించింది.  తాజా టెల్‌ అవీవ్‌ ఆస్పత్రి దాడిని ఉద్దేశించి ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్‌ కట్జ్‌(israel katz) స్వయంగా ఈ ప్రకటన చేశారు.

తాజాగా.. టెల్‌ అవీవ్‌లోని ఓ ఆస్పత్రిపై మిస్సైల్స్‌తో ఇరాన్‌ దాడులు జరిపింది. ఈ దాడికి ఇరాన్‌ సుప్రీం ఖమేనీ(Khamenei)నే బాధ్యత వహించాలంటూ పేర్కొన్న ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ .. త్వరలోనే ఆయన కథ ముగిస్తామని, ఇరాన్‌ను ఖమేనీ విముక్త దేశంగా మారుస్తామని ప్రకటించారు. జూన్‌ 13వ తేదీ నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. పోటాపోటీగా దాడులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో.. నేరుగా ఇరాన్‌ సుప్రీంను ఉద్దేశించి ఇజ్రాయెల్‌ ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అయితే.. 

ఈ బెదిరింపులను ఖమేనీ తీవ్రంగా భావించే  పరిస్థితులు కనిపించడం లేదు. ‘‘బెదిరింపులకు తలొగ్గం.. యుద్ధం తీవ్రతరం అయ్యింది’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు గట్టి సందేశాలు పంపుతున్నారు. తమపై దాడి చేసి ఇజ్రాయెల్‌ (Israel) భారీ తప్పిదం చేసిందని, అందుకు శిక్ష తప్పదని ఓ వీడియో సందేశం సైతం విడుదల చేశారాయన. 

‘‘ఇరాన్‌ లొంగిపోదనే విషయాన్ని వాళ్లు(ట్రంప్‌, నెతన్యాహులను ఉద్దేశిస్తూ) తెలుసుకోవాలి. అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్‌ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుంది. ఈ యుద్ధంలో వాళ్ల సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలి అని ఖమేనీ తన సందేశం పేర్కొన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న పోరులో అమెరికా జోక్యం చేసుకుంటే అది పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి కూడా హెచ్చరించారు. 

ఇదిలా ఉంటే.. ఖమేనీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని.. ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి ఆయన్ను చంపాలనుకోవడం లేదన్నారు. ఇరాన్‌ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని ట్రంప్‌ హెచ్చరించారు.

మరోవైపు ఖమేనీకి బెదిరింపులపై లెబనాన్‌ ఉగ్రసంస్థ హెజ్‌బొల్లా తీవ్రంగా స్పందించింది. ఈ బెదిరింపులు మూర్ఖపు చర్య అని, అలాంటి ప్రయత్నాలు జరిగితే తాము చూస్తూ ఉండబోమని, అమెరికా-ఇజ్రాయెల్‌ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది. 

ఎవరీ ఖమేనీ.. 
అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ (Ayatollah Sayyid Ali Khamenei) ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్‌. అత్యంత శక్తివంతమైన ప్రపంచాధినేతల్లో ఒకరు. ఖమేనీ ఒక షియా మత పండితుడు మాత్రమే కాదు.. రాజకీయ నేతగా ఇస్లామిక్ విప్లవంలో కీలకంగా వ్యవహరించాడు. 1989లో అయతొల్లా ఖోమేనీ మరణం తర్వాత ఇరాన్‌కు సుప్రీం అయ్యారు. 



ఖమేనీ (మధ్యలో వ్యక్తి)


ఖమేనీ జీవిత నేపథ్యం:
పుట్టిన తేదీ: జూలై 17, 1939
స్థలం: మష్హద్, ఇరాన్
విద్య: మష్హద్, కూమ్ నగరాల్లో మత విద్య
వృత్తి: మత పండితుడు, రచయిత, రాజకీయ నాయకుడు

రాజకీయ ప్రస్థానం:
1979లో ఇరాన్‌లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
విప్లవం తర్వాత ఇరాన్ అధ్యక్షుడిగా 1981 నుంచి 1989 వరకు పనిచేశారు.
1989లో ఖోమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్‌గా పగ్గాలు


సుప్రీం లీడర్‌గా.. 
ఇరాన్‌లో సుప్రీం లీడర్ పదవి అత్యున్నతమైనది. ఖమేనీకి సైనిక, న్యాయ, మత వ్యవస్థలపై పూర్తి నియంత్రణ ఉంది.  విదేశాంగ విధానాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈయనదే. ఆయన నియామకాలు, ఆదేశాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేస్తాయి. ఇటీవల ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖమేనీ పేరు మరింతగా వార్తల్లోకి వచ్చింది. ఆయన వ్యాఖ్యలు, నిర్ణయాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement