
రంజాన్ నేపథ్యంలో కాల్పుల విరమణ పొడిగింపునకు ఆమోదం
టెల్ అవీవ్: హమాస్తో కాల్పుల విరమణ తొలి దశ ఒప్పందం శనివారం ముగిసిన నేపథ్యంలో గాజాలోకి మానవతా సాయాన్ని నిలిపేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒప్పందాన్ని పొడిగించాలంటే తమ ప్రతిపాదనలకు హమాస్ ఒప్పుకుని తీరాలని షరతు విధించింది. అందుకు హమాస్ ససేమిరా అనడంతో గాజాలోకి నిత్యావసర వస్తువులు, ఔషధాలు, ఇతరత్రా సరకుల రవాణాను ఇజ్రాయెల్ బలగాలు ఆదివారం అడ్డుకున్నాయి. దాంతో మానవతా సాయానికి హఠాత్తుగా అడ్డుకట్టపడింది. దీనిపై హమాస్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
‘‘ సాయం ఆపేయం చౌకబారు బెదిరింపు చర్య. తద్వారా ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడుతోంది. తొలి దశ కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘిస్తోంది’’ అని ఆరోపించింది. అమెరికా ఆదేశాల మేరకే గాజాకు సాయాన్ని ఆపేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. రంజాన్ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 దాకా పొడిగించాలన్న అమెరికా అభ్యర్థనకు ఇజ్రాయెల్ అంగీకరించింది.
ఆ మేరకు తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఒప్పందంలో తదుపరి దశకు వెళ్లకుండా తొలి దశను పొడిగించడాన్ని హమాస్ తప్పుబట్టింది. తమ బందీల్లో సగం మందిని హమాస్ విడుదల చేస్తేనే రెండోదశ కాల్పుల విరమణకు సిద్ధపడతామని ఇజ్రాయెల్ చెబుతోంది. రెండో దశ చర్చల వేళ మరింతమంది బందీలను వదిలేయాలని డిమాండ్ చేసింది. శాశ్వత కాల్పుల విరమణ ప్రకటించి, ఇజ్రాయెల్ గాజా నుంచి వెనుతిరిగితేనే మొత్తం బందీలను వదిలేస్తామని హమాస్ తేలి్చచెప్పింది.