ఇండోనేషియాలో విమానం గల్లంతు.. | Indonesia Passenger Plane With 11 Onboard Goes Missing | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో విమానం గల్లంతు..

Jan 18 2026 4:40 AM | Updated on Jan 18 2026 4:49 AM

Indonesia Passenger Plane With 11 Onboard Goes Missing

జకార్తా: ఇండోనేషియాలో శనివారం 11 మందితో వెళ్తున్న ఓ ప్యాసింజర్ విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. జావా ద్వీపం నుంచి సులవేసి ద్వీపానికి వెళుతున్న ఈ విమానం పర్వత భూభాగానికి చేరుకోగానే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాన్ని కోల్పోయింది.

ఈ విమానంలో 8 మంది సిబ్బంది, ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానం ఆచూకీ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. విమానంలోని ప్రయాణికులు సజీవంగా ఉన్నారా లేదా చనిపోయారా అన్నది ఇంకా అధికారికంగా ధృవీకరణ జరగలేదు.

ప్రమాదం తర్వాత విలేకరుల సమావేశంలో ఇండోనేషియా ప్రభుత్వ మంత్రి మాట్లాడుతూ.. తమ దేశ సముద్ర వ్యవహారాలు, మత్స్య మంత్రిత్వ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులు విమానంలో ఉన్నారని చెప్పారు. వారు ఈ ప్రాంతంలోని వనరులపై వైమానిక నిఘా నిర్వహించేందుకు వెళ్తున్నారని వెడించారు.

గల్లంతైన టర్బోప్రాప్ ఏటీఆర్ 42-500 విమానం ఇండోనేషియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ కు చెందినది. రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎండా పూర్నామా సారీ ప్రకారం, మారోస్ జిల్లాలోని లియాంగ్-లియాంగ్ ప్రాంతంలో మధ్యాహ్నం 1:17 గంటలకు (05:17 GMT) విమానం చివరిసారిగా రాడార్లో కనిపించింది. ల్యాండింగ్ కు ముందు, అప్రోచ్ అలైన్‌మెంట్‌ను సరిచేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానాన్ని ఆదేశించిందని  చెప్పారు. కొద్దిసేపటికే రేడియో కాంటాక్ట్ తెగిపోయింది.

విమానం గల్లంతయిన ప్రాంతం కొండ, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో  ఇక్కడికి చేరుకోవడం రెస్క్యూ బృందాలకు పెద్ద సవాలుగా మారింది. సెర్చ్ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు, వైమానిక దళానికి చెందిన గ్రౌండ్ యూనిట్లను మోహరించారు. దక్షిణ సులవేసి హసనుద్దీన్ సైనిక కమాండర్ మేజర్ జనరల్ బంగున్ న్వోకో ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఇంతలో, మౌంట్ బులుస్రాంగ్ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న కొంతమంది హైకర్లు పర్వతంపై చెల్లాచెదురుగా ఉన్న శిధిలాలు, విమానం లాంటి లోగో, మంటలను చూసినట్లు చెప్పారు. ఈ సమాచారాన్ని నిర్ధారించడానికి సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని మేజర్ జనరల్ నవోకో తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో మేఘాలు ఉన్నాయని, అయితే దృశ్యమానత 8 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement