
రూ.23.3 లక్షలు చెల్లిస్తే జీవితకాల వీసా
ఆస్తులు, వ్యాపారాలతో అవసరం లేని విధానం
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసా పథకాన్ని ప్రారంభించింది. కొన్ని షరతులతో నామినేషన్ విధానంలో ఈ వీసాను జారీ చేయనుంది. లక్ష అరబ్ ఎమిరేట్స్ దినార్లు (సుమారు రూ.23.3 లక్షలు) ఫీజు చెల్లిస్తే జీవితకాలం వర్తించే వీసా అందజేస్తుంది. ఇప్పటిదాకా దుబాయ్లో గోల్డెన్ వీసా పొందాలనుకునే భారతీయులు రూ.4.66 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసి ఉండాలి. లేదా వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టి ఉండాలి.
ఇవేమీ అవసరం లేకుండానే కేవలం ఫీజుతోనే వీసాను అందజేసేందుకు ఉద్దేశించిన ఈ విధానంలో వచ్చే మూడు నెలల్లో కనీసం 5 వేల మంది భారతీయులు దరఖాస్తు చేసుకునే అవకాశముందన్నది దుబాయ్ ప్రభుత్వ వర్గాల అంచనా. పథకం పైలట్ ప్రాజెక్టు కోసం భారత్తోపాటు బంగ్లాదేశ్ను ఎంపిక చేసింది. గోల్డెన్ వీసా కావాలనుకునే వారు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న రయాద్ గ్రూప్ కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది.
లేదా ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆ కంపెనీ ఎండీ రయాద్ కమాల్ అయూబ్ చెప్పారు. దరఖాస్తుదారుల పూర్తి వివరాలు, మనీ లాండరింగ్ కేసులు, నేర చరిత్రతోపాటు సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తామన్నారు. అన్నీ ఓకే అయితేనే ఆ దరఖాస్తును ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. వీసా జారీపై తుది నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని వివరించారు. ఫీడ్ బ్యాక్ ఆధారంగా మున్ముందు ఈ పథకాన్ని చైనా వంటి ఇతర సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా) కుదిరిన దేశాలకు దుబాయ్ ప్రభుత్వం వర్తింపజేయనుంది.